ఆరంభంలోనే షాక్:
233 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ డికాక్ (0) డకౌట్ అయ్యాడు. నాలుగో ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ (12) కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం లూయిస్ (15), సూర్యకుమార్ ( 26) కాసేపు ఇన్నింగ్స్ ను నడిపించారు. రసెల్ వీళ్లిద్దరిని ఔట్ చేశాడు. 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ముంబై.
పాండ్య అద్భుత ఇన్నింగ్స్:
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్ (20; 21 బంతుల్లో 2×4) బ్యాటు ఝుళిపించలేకపోయినా.. హార్దిక్ మాత్రం సిక్స్లు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే పొలార్డ్ ఔటైనా.. హార్దిక్ జోరు తగ్గలేదు. చావ్లా, గర్నీ, నరైన్ల బౌలింగ్ లో బౌండరీలు, సిక్సులు బాదుతూ 17 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. హార్దిక్ ఎంత బాదినా సాధించాల్సిన రన్రేట్ ఎక్కువవుతోంది. చివరి 6 ఓవర్లలో ముంబయి 100 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చివరలో తడబాటు:
కృనాల్, హార్దిక్లు ఫోర్లు బాదడంతో 16వ ఓవర్లో 20 పరుగులు.. 17వ ఓవర్లో 14 పరుగులొచ్చాయి. ఇక చివరి 3 ఓవర్లలో 59 పరుగులు చేయాల్సి ఉంది. గర్నీ వేసిన 18వ ఓవర్లో 6, 4 బాదిన హార్దిక్.. చివరి బంతికి పెవిలియన్ చేరాడు. అనంతరం కృనాల్ కూడా అవుట్ అవ్వడంతో కోల్కతా విజయం ఖాయం అయింది. ముంబై జట్టు చివరలో తడబడి మూల్యం చెల్లించుకుంది. మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 2 వికెట్లకు 232 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (45 బంతుల్లో 76; 6 ఫోర్లు, 4 సిక్స్లు), క్రిస్ లిన్ (29 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్లు), రసెల్ (40 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగారు.