బుమ్రా సేవలను కోల్పోనున్న ముంబై!
రాబోయే సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు జస్ప్రీత్ బుమ్రా సేవలను కోల్పోయే అవకాశం ఉంది. పేసర్లపై పనిభారం ఎంత మేర ఉందనే విషయమై ప్రస్తుతం బీసీసీఐ ఆయా వివరాలను సిద్ధం చేస్తోందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బుమ్రాకు విశ్రాంతి కల్పించాలని ముంబై ఇండియన్స్తో బీసీసీఐ మాట్లాడనుంది.
విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ ఆలోచన
ఒకవేళ బుమ్రా ఫిట్గా ఉంటే కీలక మ్యాచ్ల్లో ఆడించి మిగతా మ్యాచ్ల్లో విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఇలా చేయడం వల్ల బుమ్రా అలసిపోకుండా ఉంటాడు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని కీలక బౌలర్లకు విశ్రాంతి ఇవ్వాలని కోహ్లీ చేసిన సూచనపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ విబేధించాడు.
ముంబై ప్లేఆఫ్ చేరితే బుమ్రాకు విశ్రాంతి ఇవ్వలేం
ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ ప్లేఆఫ్ చేరితే బుమ్రాకు విశ్రాంతి ఇవ్వలేమని తేల్చి చెప్పాడు. మరోవైపు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి అనే విరాట్ కోహ్లీ సూచనపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సైతం విభేధించిన సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోని "ప్రపంచకప్కి ముందు భారత బౌలర్లు గాయపడకుండా చూసుకోవడం మంచిదే" అని ధోని అన్నాడు.
కోహ్లీ వ్యాఖ్యలతో విభేధించిన ధోని
"అలా అని వారికి పూర్తిగా రెస్ట్ ఇస్తే మ్యాచ్ కామెంటేటర్లు లయ కోల్పోయారంటూ వ్యాఖ్యానిస్తారు. ఒకవేళ ఎక్కువ మ్యాచ్లు ఆడించామంటే? బాగా అలసిపోయారని పెదవి విరుస్తారు. దీనిని బట్టి బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. వరల్డ్ కప్కి ముందు బౌలర్లని ఐపీఎల్లో ఆడించాలనేది మంచి ఆలోచనే. వారు లయ అందుకునేందుకు అక్కడ చక్కటి అవకాశం దొరుకుతుంది" అని ధోని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2019 సీజన్కి ఆసీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం
వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తమ స్టార్ ప్లేయర్లను ఐపీఎల్ 2019 సీజన్కి దూరంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం తమ ఆటగాళ్లకి పూర్తి స్థాయిలో ఐపీఎల్ సీజన్ ఆడేందుకు అంగీకరించింది. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా 9 వికెట్లు తీసిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.