ఎవ్వరూ ముందుకురాకపోవడంతో
డాషింగ్ బ్యాట్స్మెన్గా భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన యువరాజ్ సింగ్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. అటు టీమిండియాలోకి రాలేక.. క్రికెట్ను వీడలేక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్లోనూ కోట్లు పెట్టి కొనుక్కున్న జట్లకు సరైన న్యాయం చేయలేకపోతున్నాడు. దీంతో అతడి ధర ఏటా దిగజారిపోతూ వచ్చింది. యువరాజ్ అభిమానుల్ని వేలం సందిగ్ధంలో పడేసింది. తొలి దశలో కనీస ధర రూ.కోటికి కొనడానికి కూడా ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. చివర్లో మరోసారి అతడి పేరును వేలంలో ప్రస్తావించగా .. వేరే ఫ్రాంఛైజీల నుంచి పోటీ లేకపోవడంతో ముంబై రూ.కోటికే కొనుగోలు చేసింది.
ఆరంభం ఘనంగానే.. ఇప్పుడే ఘోరంగా
ఒకానొకప్పుడు యువరాజ్ వేలంలో ఉన్నాడంటే పోటీపడి కొనుగోలు చేసే పరిస్థితి. 2011లో పుణె జట్టు 1.8 మిలియన్ డాలర్లు (12.78 కోట్లు)కి యువరాజ్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2014లో ఆర్సీబీ రూ.14 కోట్లకి, 2015లో ఢిల్లీ డేర్డెవిల్స్ ఏకంగా రూ.16 కోట్లు ధరకు యువీని దక్కించుకున్నాయి. అయితే కొనుగోలు చేసిన ధరకు యువీ సరైన న్యాయం చేయడం లేదని భావించిన ఆయా జట్లు తర్వాత ఏడాది అతడిని వదిలిపెట్టేశాయి. 2016లో సన్రైజర్స్ 7 కోట్లు పెట్టి యువీని కొనుగోలు చేయగా.. 2018లో పంజాబ్ 2 కోట్ల బేస్ ధరకి యువీని దక్కించుకుంది.
తొలి రౌండ్లో మిగిలిపోయిన యువీ
కొంతకాలంగా యువీ ఏ ఫార్మాట్లోనూ రాణించకపోవడం.. ముఖ్యంగా టీమిండియాలో చోటు దక్కించుకోకపోవడం తదితర కారణాలతో 2019 వేలంలో యువీ తొలి రౌండ్లో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. రెండో రౌండ్లో ముంబై ఇండియన్స్ జట్టు రూ.కోటి (బేస్ ధర)కి కొనుగోలు చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ముంబై ఇండియన్స్ నిర్ణయంపై యువీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుడు నమ్మకాలు పెట్టుకుని కొనుగోలు చేసిన పంజాబ్కు న్యాయం చేయలేకపోయిన యువీ ఈసారేం చేస్తాడో మరి..
యువీ రేటు మారిందిలా..
2014-రూ.14 కోట్లు (బెంగళూరు); 2015-రూ.16 కోట్లు (ఢిల్లీ); 2016-రూ.7 కోట్లు (సన్రైజర్స్); 2018-రూ.2 కోట్లు (పంజాబ్); 2019-రూ.కోటి (ముంబై)