

హైదరాబాద్: క్రికెట్ మహోత్సవం ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. క్రికెట్లో ప్రపంచకప్, టీ20 కప్ ఎలాగ ప్రత్యేకమో... ఐపీఎల్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకుంది. శనివారం 11వ సీజన్కు తెరలేవబోతోంది. మొత్తం 51 రోజులు పాటు జరిగే ఈ ఐపీఎల్లో 8 జట్లు పాల్గొంటున్నాయి. 9 ప్రధాన నగరాల్లో 60 మ్యాచ్లను నిర్వహించనున్నారు.
ఐపీఎల్ 11వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రెండేళ్ల నిషేధం అనంతరం ఐపీఎల్లోకి అడుగుపెడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మరింతగా చేరువయ్యేందుకు అనేక ప్రచార కార్యక్రమాలను చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫొటో షూట్లు, యాడ్లతో బిజీబిజీగా గడుపుతున్నారు చెన్నై ఆటగాళ్లు.
మరోవైపు ముంబైలోని వాంఖడె జరిగే తొలి మ్యాచ్ కోసం ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియోని పోస్టు చేసింది. 'విజిల్ పోడు' అంటూ చెన్నై ఆటగాళ్లు, అభిమానులతో కూడిన ఆ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
'వేసవి కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఇక ఎల్లో ఆర్మీ కూడా తిరిగి ఐపీఎల్లోకి అడుగుపెట్టింది. ఇంకా దేనికోసం ఎదురుచూస్తున్నారు? విజిల్ పోడు.. అంటూ' కెప్టెన్ ధోని జట్టులోని మిగతా ఆటగాళ్లు అందరూ డ్యాన్స్ చేయడాన్ని ఈ వీడియో మనం చూడొచ్చు. ఐపీఎల్ 11వ సీజన్కి శనివారం తెరలేవనుంది.
టోర్నీలో భాగంగా జరిగే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ఇదిలా ఉంటే ప్రారంభ వేడుకలకు ఎనిమిది జట్ల కెప్టెన్లు హాజరుకాకపోవడం అభిమానులను కాస్తంత నిరుత్సాహానికి గురి చేస్తోంది.