హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)... భారత క్రికెట్ను నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్లిన క్యాష్ రిచ్ టోర్నీ. ఐపీఎల్ మొదలుకాబోతుందంటే చాలు సందడే సందడి. గత పది సీజన్లుగా భారత క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ చాలా దగ్గరైంది. ప్రస్తుతం జరగబోయే ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానుంది.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్యయ్యాయి. ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ అభిమానుల నరనరాల్లో జీర్ణించుకుపోయిందనే చెప్పాలి. ఐపీఎల్ మ్యాచ్లు వస్తున్నాయంటే దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఉండే ఆ సందడే వేరు. దేశంలోని కొన్ని కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయి మరీ వీక్షిస్తుంటారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాల హక్కుల కోసం పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్ధలే పోటీ పడ్డాయి. అయితే ఈ పోటీలో గతేడాది ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ హక్కులను బీసీసీఐ వేలం వేయగా స్టార్ ఇండియా రూ.16347 కోట్లకు సొంతం చేసుకుంది. తాజాగా ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేసేందుకు ప్రసారభారతి, స్టార్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది.
తాజా ఒప్పందం ఆదాయంలో ప్రకారం చెరో 50శాతం వాటాను తీసుకునేందుకు అంగీకరించాయి. అయితే ఒప్పందం ప్రకారం ఐపీఎల్ ఆరంభ వేడుక, కీలక మ్యాచ్లు, ముగింపుకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలు మాత్రమే దూరదర్శన్లో వీక్షించే అవకాశమున్నట్లు తెలిసింది.
అంతేకాదు ప్రతీ ఆదివారం జరిగే మ్యాచ్లను దూరదర్శన్లో కూడా ప్రసారం చేసేందుకు స్టార్ నెట్వర్క్ అంగీకరించింది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లు దూరదర్శన్లో ప్రసారమవుతాయో లేదో తెలియాల్సి ఉంది. అన్ని మ్యాచ్లు దూరదర్శన్లో ప్రసారమైతే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని స్టార్ ఇండియా పేర్కొంది.