
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో చెన్నై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి చేధించింది.
చెన్నై ఆటగాళ్లలో కెప్టెన్ ధోని (70 నాటౌట్; 34 బంతుల్లో ఒక ఫోర్, 7సిక్సులు) బాదగా, తెలుగు కుర్రాడు అంబటి రాయుడు (82; 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)తో చెలరేగాడు. 55 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నైని వీరిద్దరూ ఆదుకున్నారు. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాయడు ఇచ్చిన సునాయస క్యాచ్ను ఉమేశ్ యాదవ్ జారవిడిచాడు.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మ్యాచ్ 15 ఓవర్ల వరకు బెంగళూరు వైపే ఉన్నప్పటికీ, చివరి 5 ఓవర్లలో బెంగళూరు బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 18 ఓవర్లో రాయుడు 82(53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)ను ఉమేశ్ యాదవే రనౌట్ చేశాడు.
దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. రాయుడు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చి బ్రేవో (14) సాయంతో ధోని (70) గెలుపుని సిక్సుతో లాంఛనంగా పూర్తి చేశాడు. బెంగళూరు బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు, ఉమేశ్ యాదవ్, పవన్ నేగి తలో వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ధోని, రాయుడు సిక్సుల మోత
206 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టు 15 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. చెన్నై జట్టు గెలవాలంటే 30 బంతుల్లో 71 పరుగులు చేయాలి. క్రీజులో అంబటి రాయుడు (61; 44 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులు), ధోనీ (38; 22 బంతుల్లో 4 సిక్సులు) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి బెంగళూరు బౌలర్లను ఓ ఆట ఆడుకుంటున్నారు. సిక్సర్లు బాదేస్తున్నారు. మ్యాచ్ ఉత్కంఠగా మారుతోంది.
ఛేదనలో తడబడుతున్న చెన్నై
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో 206 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుని ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ వాట్సన్ (7) వికెట్ని కోల్పోయిన చెన్నై.. ఆ తర్వాత హిట్టర్ సురేశ్ రైనా (11), శామ్ బిల్లింగ్స్ (9), రవీంద్ర జడేజా(3) వికెట్లని చేజార్చుకుంది. జడేజా ఔటైన తర్వాత క్రీజులోకి ధోని వచ్చాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ అంబటి రాయుడు (44), ధోని(7) పరుగులతో ఉన్నారు.
దూకుడుగా ఆడుతోన్న రాయుడు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై ఆటగాడు అంబటి రాయుడు (31) దూకుడుగా ఆడుతున్నాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో చెలరేగుతున్నాడు. అయితే ఉమేశ్ యాదవ్ వేసిన 5.1వ బంతికి సురేశ్ రైనా (11) ఔటయ్యాడు. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 2 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. శామ్ బిల్లింగ్స్ (5) క్రీజులోకి వచ్చాడు.
తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 206 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనింగ్ శుభారంభం దక్కలేదు. ఓపెనర్ షేన్ వాట్సన్ (15) ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ అంబటి రాయుడు (15) దూకుడుగా ఆడుతున్నాడు. 3 ఓవర్లు ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అంబటి రాయుడు (15), సురేశ్ రైనా(2) పరుగులతో ఉన్నారు.
చెన్నై విజయ లక్ష్యం 206
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ(18), డీకాక్(53) చక్కటి శుభారంభాన్నిచ్చారు.
అయితే శార్ధూల్ వేసిన ఐదవ ఓవర్ రెండో బంతికి విరాట్ కోహ్లీ మిడ్ ఆన్ మీదుగా భారీ షాట్కి ప్రయత్నించి జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్... డికాక్తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కి 103 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే బ్రావో వేసిన 13వ ఓవర్ మొదటి బంతికి డికాక్(53) బ్రావోకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొంత సమయానికే తాహీర్ బౌలింగ్లో డివిలియర్స్(68) బిల్లింగ్స్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికి ఆండర్సన్ హర్భజన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన మన్దీప్ సింగ్(32) దూకుడుగా ఆడుతూ పరుగులు వరద పారించాడు. అయితే శార్ధూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్లో బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోయింది.
చివర్లో వాషింగ్టన్ సుందర్ (13) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో చెన్నైకి 206 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్, డ్వేన్ బ్రేవోలు తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
15 ఓవర్లకు బెంగళూరు 142/4
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్లో బెంగళూరు వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తాహీర్ బౌలింగ్లో డివిలియర్స్(68) బిల్లింగ్స్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికి ఆండర్సన్ హర్భజన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 15 ఓవర్లకు గాను బెంగళూరు 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మన్దీప్ సింగ్, కోలిన్ డి గ్రాండ్హోమ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
డీకాక్ ఔట్: రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్లో బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా ఆడుతోన్న క్వింటన్ డీకాక్ (53; ఒక్ ఫోర్, 4 సిక్సులు) డ్వేన్ బ్రావో బౌలింగ్లో వికెట్లు ముందు దొరికిపోయాడు. దీంతో 14 ఓవర్లకు గాను బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డివిలియర్స్ (66), కోరీ ఆండర్సన్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.
10 ఓవర్లకు బెంగళూరు 87/1
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్లో బెంగళూరు జట్టు నిలకడగా ఆడుతోంది. కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో 10 ఓవర్లకు గాను బెంగళూరు వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డివిలియర్స్ (28), డీకాక్ (41) పరుగులతో ఉన్నారు.
కోహ్లీ ఔట్: బెంగళూరు 5 ఓవర్లకు 35/1
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్లో బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ రెండో బంతికి విరాట్ కోహ్లీ (18) పరుగుల వద్ద రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 5 ఓవర్లకు గాను బెంగళూరు వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజులో డీకాక్ (17), ఏబీ డివిలియర్స్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.
దూకుడుగా ఆడుతోన్న బెంగళూరు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతోన్న మ్యాచ్లో బెంగళూరు ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 3 ఓవర్లకు గాను వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (17), డీకాక్ (11) పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజనులో తొలిసారిగా ఇరు జట్లు తలపడుతున్నాయి.
చెన్నై Vs బెంగళూరు లైవ్ మ్యాచ్ స్కోరు కార్డు
ఈ మ్యాచ్లో ఇరు జట్లు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. చెన్నై జట్టులో కర్ణ్ శర్మ, డుప్లెసిస్ స్థానంలో హర్భజన్, ఇమ్రాన్ తాహిర్లు తుది జట్టులో చోటు దక్కగా.... ఇక, బెంగళూరు జట్టులో మనన్ వోహ్రా స్థానంలో పవన్ నేగీ, క్రిస్వోక్స్ స్థానంలో కొలిన్ డి గ్రాండ్హోమ్ ఆడుతున్నారు.
ఈ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్లన్నీ హాట్కేకుల్లా అమ్ముడుపోయినట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్లో ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలకు కూడా కీలకంగా మారింది. ఎందుకంటే ఈ ఇద్దరూ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. 4658 పరుగులతో రైనా మొదటి స్థానంలో ఉండగా.. 4649 పరుగులతో విరాట్ రెండోస్థానంలో ఉన్నాడు.
దీంతో ఈ మ్యాచ్లో ఎవరు అద్భుతంగా రాణిస్తే.. వాళ్లు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తారు. రెండేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. మొదటి మ్యాచ్ నుంచీ జోరు కొనసాగిస్తూనే వస్తోంది. చెన్నై ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో.. నాలుగింట గెలుపొంది పాయింట్ల పట్టకిలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇక, టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లాడిన బెంగళూరు జట్టు కేవలం రెండింటిలో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరో స్థానం ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు ఐపీఎల్లో 21సార్లు తలపడగా, అందులో చెన్నై 13సార్లు గెలవగా, బెంగళూరు 7సార్లు విజయం సాధించింది. ఒక్క మ్యాచ్లో ఫలితం తేలలేదు.
ఇక, బెంగళూరు వేదికగా జరిగిన ఏడు మ్యాచ్లలో చెన్నై మూడింట గెలవగా, బెంగళూరు మూడు సార్లు విజయం సాధించింది. మిగతా మరో మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీస్తే ఐపీఎల్లో 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరతాడు.
జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్:
షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేష్ రైనా, సామ్ బిల్లింగ్స్, ఎంఎస్ ధోనీ(కీపర్/కెప్టెన్) డ్వెన్ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, దీపర్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహీర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
క్వింటన్ డి కాక్, పవన్ నేగీ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, కోరే అండర్సన్, మన్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, కోలిన్ డీ గ్రాండ్హోం, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, యుజవేంద్ర చాహల్.