హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా ఆదివారం బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగుళూరు, రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో బెంగుళూరుపై రాజస్థాన్ జట్టు 19పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో బెంగుళూరు జట్టు కేవలం ఫీల్డింగ్లో మాత్రమే.. ప్రతిభ చూపించింది. మిగతా ఏ విభాగంలోనూ తగినంత నైపుణ్యం ప్రదర్శించకపోవడంతో జట్టు ఓడిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టు జోస్ బట్లర్ కూడా పొరబాట్లు చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఐపీఎల్ 2018 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ వరుస తప్పిదాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో బట్లర్ ఒక స్టంపింగ్తో పాటు సులువైన రనౌట్ అవకాశాన్ని జారవిడిచాడు. అయితే.. మ్యాచ్పై ఈ తప్పిదాల ప్రభావం పడకపోవడంతో.. చివరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఊపిరి పీల్చుకుంది. కానీ.. టోర్నీలో ఇదే కీపింగ్ తడబాటు కొనసాగితే.. రాజస్థాన్ జట్టుకి కష్టాలు తప్పేలా లేవు.
218 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు జట్టు 8.4 ఓవర్లు ముగిసే సమయానికి 84/2తో నిలిచిన దశలో హిట్టర్ ఏబీ డివిలియర్స్ను స్టంపౌట్ చేసే అవకాశాన్ని బట్లర్ చేజార్చాడు. అనంతరం కొద్దిసేపటికే మళ్లీ డివిలియర్స్నే రనౌట్ చేసే ఛాన్స్ని జారవిడిచాడు. అయితే.. ఈ లైఫ్స్ని సరిగా వినియోగించుకోలేకపోయినా పేలవ ప్రదర్శనతో ఏబీ డివిలియర్స్ 18 బంతుల్లో (20) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో.. చివరికి రాజస్థాన్ జట్టు 19 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
కానీ.. బట్లర్ తప్పిదాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొఫెషనల్ వికెట్ కీపర్వేనా..? అయితే.. ఈ తప్పిదాలు ఏంటి.. మరో కమ్రాన్ అక్మల్.. అంటూ సోషల్ మీడియాలో అభిమానులు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో రూ. 4.4 కోట్లకి ఈ ఇంగ్లాండ్ వికెట్ కీపర్/ బ్యాట్స్మెన్ని రాజస్థాన్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. కాగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు బుధవారం ఏప్రిల్ 18న కోల్కతా జట్టుతో రాజస్థాన్లోని సవాయి మన్సింగ్ స్టేడియం వేదికగా తలపడనుంది.