చెన్నైకి మరో దెబ్బ: స్వదేశానికి లుంగీ ఎంగిడి, తిరిగొస్తాడో లేదో!

హైదరాబాద్: రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్ 11వ సీజన్లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కేదార్ జాదవ్ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గాయం కారణంగా సురేశ్ రైనా రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.
తాజాగా దక్షిణాఫ్రికా బౌలర్ లుంగీ ఎంగిడి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఎందుకంటే శుక్రవారం ఉదయం లుంగీ తండ్రి జీరోమ్ ఎంగిడి మరణించారు. దీంతో అనుకోకుండా లుంగీ ఎంగిడి ఐపీఎల్కు దూరమయ్యాడు. అంతేకాదు తిరిగి ఐపీఎల్లో ఆడేందుకు వస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

వేలంలో రూ. 50 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై
ఈ ఏడాది ఆరంభంలో భారత్-దక్షిణాఫ్రికా పర్యటనలో లుంగీ ఎంగిడి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలనుకున్న కోహ్లీసేన ఆశలపై నీళ్లు చల్లాడు. అంతేకాదు మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 2-1తో దక్షిణాఫ్రికా గెలుచుకోవడంలో కూడా ఎంగిడి కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనను చూసే ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో రూ. 50 లక్షలకు చెన్నై ప్రాంఛైజీ కొనుగోలు చేసింది.

చెన్నై ఆడిన రెండు మ్యాచ్ల్లో ఎంగిడికి చోటు దక్కలేదు
ఈ సీజన్లో ఇప్పటి వరకు చెన్నై ఆడిన రెండు మ్యాచ్ల్లో ఎంగిడికి చోటు దక్కలేదు. గత రెండు మ్యాచ్ల్లో మార్క్ వుడ్ సరైన ప్రదర్శన చేయకపోవడంతో మూడో మ్యాచ్లో అతడికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఇలా జరగడం చెన్నై సూపర్కింగ్స్కు పెద్ద ఎదురుదెబ్బే. ఈ సందర్భంగా డుప్లెసిస్ మాట్లాడుతూ ‘లుంగీ ఎంగిడి తండ్రి జీరోమ్ మరణవార్త జట్టు సభ్యులందరినీ కలచివేసింది. అతనికి, అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. లుంగీ ఎంగిడీకి ఇది ఎంతో కఠినమైన సమయం' అని అన్నాడు.

టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్ కోల్కతాతో
టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. కావేరీ జల వివాదం నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో సొంతగడ్డపై చెన్నై ఆడాల్సిన మ్యాచ్లను పూణెకి తరలించారు. తాజాగా పూణెలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి బాంబే హైకోర్టు వివరణ కోరడంతో చెన్నై ఫ్రాంఛైజీ ఆందోళనలో పడింది.

పూణెలో మ్యాచ్లపై ఎంసీఏకు బాంబై హైకోర్టు నోటీసులు
పూణె వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం వినియోగించే నీటిని ఎలా సమకూర్చుకుంటున్నారో తమకు వివరణ ఇవ్వాలని శుక్రవారం మహారాష్ట్ర క్రికెట్ సంఘం(ఎంసీఏ)కు కోర్టు నోటీసులు పంపించింది. నోటీసులపై ఏప్రిల్ 18లోగా సమాధానం చెప్పాలని గడువు విధించింది. అంతేకాదు మ్యాచ్ల కోసం పిచ్ను తయారుచేసేందుకు లక్షలాది లీటర్ల నీటిని ఉపయోగిస్తారు. చెన్నైలో నిర్వహించాల్సిన మ్యాచ్లను పుణెలో నిర్వహిస్తామని చెన్నై యాజమాన్యం, ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా తెలిపిన మరుసటి రోజే కోర్టు నోటీసులు పంపడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications