హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో తన అద్భుతమైన బౌలింగ్తో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా జస్ప్రీత్ బుమ్రా పేరొందాడు. గుజరాత్ లయన్స్తో ఇటీవల ముగిసిన 'సూపర్ ఓవర్' మ్యాచ్లో బుమ్రా అద్భుతంగా యార్కర్లతో ముంబైని గెలిపించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా బుమ్రా తన కెరీర్కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ కోసం నెట్స్లో యార్కర్లను శ్రీలంక బౌలింగ్ దిగ్గజం మలింగతో కలిసి ప్రాక్టీస్ చేయడం తనకు కలిసొచ్చిందని.. అతని సహకారంతోనే తన బౌలింగ్ మెరుగైందని బుమ్రా చెప్పుకొచ్చాడు.
'తొలుత ఔట్ స్వింగర్ ఎలా వేయాలో నాకు తెలిసేది కాదు. లసిత్ మలింగనే నాకు నేర్పించాడు. నా బౌలింగ్ యాక్షన్ భిన్నంగా ఉండటంతో ఔట్ స్వింగర్తో నువ్వు విజయం సాధిస్తావని నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఇప్పటికీ నా బౌలింగ్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా? అని మలింగని అడుగుతుంటాను. కెరీర్ ఆరంభంలో నేను చాలా దూకుడుగా ఉండేవాడ్ని' అని బుమ్రా అన్నాడు.
'బ్యాట్స్మెన్ పరుగులు చేసినా లేదా అవుటైనా నోటికి పనిచెప్పేసేవాడ్ని. కానీ.. ఇది తప్పని మలింగతో మాట్లాడిన తర్వాత తెలిసింది. బంతి విసిరిన తర్వాత ఎలాంటి బంతి విసిరావు. ఫలితం ఏంటని నువ్వు ఆలోచించుకుని సరిదిద్దుకోవాలంటే ఆ కొన్ని క్షణాలు సైలెంట్గా ఉండాలని మలింగ నాకు సూచించాడు' అని బుమ్రా వివరించాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరూ బౌలర్లు అద్భుత విజయాలను అందిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లాడిన ముంబై ఇండియన్స్ ఎనిమిది మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.