తొలి ఓవర్లో 18 పరుగులు:
131 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించింది. పూజా వస్ర్తాకర్ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ లీ (16) మూడు ఫోర్లతో 18 పరుగులు రాబట్టింది. కానీ.. రెండో ఓవర్లోనే ఈ ప్రమాదకర బ్యాట్స్ఉమన్ను శిఖా పాండే బౌల్డ్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఇక స్పిన్నర్లు రంగ ప్రవేశం చేయడంతో.. స్కోరు బోర్డుకు బ్రేకులు పడ్డాయి.
తిప్పేసిన దీప్తి:
ఐదో ఓవర్లో దీప్తి శర్మ దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. ఆ ఓవర్లో బ్రిట్స్ (3), డి క్లెర్క్ (0)ను ఔట్ చేసి సఫారీలను కష్టాల్లోకి నెట్టింది. ఆ తర్వాత 9వ ఓవర్లో పూనమ్ యాదవ్ వరుస బంతుల్లో వాల్వర్ట్ (14), కెప్టెన్ లుస్ (0)ను పెవిలియన్ పంపింది. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి సఫారీలు 51/5తో నిలిచారు. దీప్తి వేసిన తొలి మూడు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీసింది.
ప్రీజ్ఒంటరి పోరాటం:
ఓ వైపు వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా ప్రీజ్ మాత్రం భారీ షాట్లతో విరుచుకుపడింది. ప్రీజ్ సిక్సర్లు కొడుతూ 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ (43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 59) పూర్తి చేసింది. అయితే చివరి ఓవర్లో 18 రన్స్ అవసరం కాగా.. మొదటి బంతిని సిక్సర్గా మలిచిన ప్రీజ్.. నాలుగో బంతికి స్టంపౌట్ కావడంతో సఫారీల కథ ముగిసింది. చివరకు దక్షిణాఫ్రికా 19.5 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.
షఫాలీ వర్మ డకౌట్:
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. మిథాలీ స్థానంలో అరంగేట్రం చేసిన 15 ఏండ్ల షఫాలీ వర్మ (0) నాలుగు బంతులాడి ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. ఈ సమయంలో జెమీమా రోడ్రిగ్స్ (25 బంతుల్లో 3 ఫోర్లతో 19)తో కలిసి చక్కటి షాట్లు ఆడిన స్మృతి మందన (16 బంతుల్లో 4 ఫోర్లతో 21) ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. మందన క్యాచ్ ఔట్ అయ్యాక.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడింది.
హర్మన్ జోరు:
పదో ఓవర్లో జెమీమా అవుటైనా.. హర్మన్ జోరు ఆగలేదు. అయితే 16వ ఓవర్లో డి క్లెర్క్..దీప్తి (16)తో పాటు హర్మన్ను కూడా అవుట్ చేసి షాకిచ్చింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడినా.. తన్మ య్ (5 బంతుల్లో 11 నాటౌట్) వేగంగా ఆడడంతో స్కోరు 130కి చేరింది. షబ్నిమ్ ఇస్మాయిల్ (3/26), నడైన్ డిక్లెర్క్ (2/10) రాణించారు.