ఇస్లామాబాద్: భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2016 సందర్భంగా పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో పీటీవీ ప్రసారం కోసం వెళ్లిన జడేజాను ఓ పాకిస్థాన్ బాలుడు కలిశాడు.
తన పరిస్థితిని వివరించడంతో చలించిపోయిన జడేజా.. ఆ బాలుడి విద్యకు అయ్యే పూర్తి ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చాడు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. క్రికెటర్లు ఉండే హోటల్ సమీపంలో జడేజాను.. కార్లు తుడుచుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ బాలుడు, అతని తల్లి కలిశారు. తమ దయనీయ పరిస్థితిని ఆయనకు వివరించారు.
దీంతో వారిని సమీపంలోని ఓ రెస్టారెంట్కు తీసుకెళ్లిన జడేజా.. వారికి భోజనం పెట్టించాడు. వారితోపాటే జడేజా కూడా భోజనం చేశాడు. 'ఇక నుంచి నీవు పని చేయాల్సిన అవసరం లేదు. చక్కగా చదువుకోవాలి. నీ విద్యకయ్యే పూర్తి ఖర్చు నేనే భరిస్తాను. ' అని ఆ బాలుడికి జడేజా హామీ ఇచ్చాడు.
ఈ ఘటనపై మీడియా ప్రశ్నించగా.. తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా తాను ఈ విధంగా పండగ జరిపినట్లు తెలిపాడు ఈ మాజీ ఆటగాడు.