
హైదరాబాద్: ఐసీసీ చాంపియన్ షిప్లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో శుక్రవారం ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 41 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. దీప్తి శర్మ, శిఖా పాండే తలో రెండు వికెట్లు తీసుకోగా... జులన్ గోస్వామికి ఒక వికెట్ లభించింది. ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ హీథర్ నైట్(39 నాటౌట్), ఆల్రౌండర్ సీవర్(44)లు మాత్రమే రాణించారు. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన ఏక్తాబిస్త్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 49.4 ఓవర్లలో కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన (24) పరుగులకే పెవిలియన్కు చేరి నిరాశపరిచింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ (44)తో కలిసి మరో ఓపెనర్ రోడ్రిగ్స్(48) దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు తేరుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ కూడా పెవిలియన్కు చేరడంతో భారత మహిళల జట్టు 92 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో జట్టుని ఆదుకోవాల్సిన మిడిలార్డర్ బ్యాట్స్మన్ చేతులెత్తేశారు.
గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమైన హర్మన్ ప్రీత్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్లీన్ డియోల్(2) పూర్తిగా నిరాశపరిచింది. చివర్లో తాన్య భాటియా(25), గోస్వామి(30)లు రాణించడంతో భారత మహిళల జట్టు 49.4 ఓవర్లలో కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఎల్విస్, సీవిర్, సోఫీ ఎలెక్స్టోన్లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ష్రబ్షోల్కు ఒక వికెట్ లభించింది.