హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రాజ్కోట్ వేదికగా అక్టోబర్ 4(గురువారం) నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని సెలక్టర్లు యువ ఆటగాళ్లను ఈ టెస్టు సిరిస్ కోసం ఎంపిక చేశారు.
ధావన్ టెస్టు కెరీర్ ముగిసి పోలేదు: తొలిసారి నోరు విప్పిన ఎమ్మెస్కే ప్రసాద్
దీంతో, ఈ టెస్టు సిరిస్లో భారత క్రికెట్ అభిమానులు కొత్త ఓపెనర్లను చూడబోతున్నారు. మరోవైపు భారత పర్యటనకు వచ్చిన వెస్టిండిస్ జట్టులో కూడా కొత్త ముఖాలు చేరాయి. ఈ పర్యటన కోసం వెస్టిండిస్ బోర్డు సైతం యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది.
కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉండగా... జాసన్ హోల్డర్ నాయకత్వంలోని వెస్టిండిస్ జట్టు 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈ రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ టీమిండియాకు పెద్ద సవాల్ కాకపోయినప్పటికీ, సొంతగడ్డపై తన జైత్రయాత్రను కొనసాగించాలని ఊవిళ్లూరుతోంది.
అత్యుత్తమ బౌలింగ్ ఎటాక్తో భారత పర్యటనకు విండిస్: కోహ్లీసేన నిలబడేనా?
గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్లో వెస్టిండిస్ రికార్డు మరీ పేలవంగా ఉంది. ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి వెస్టిండీస్ టెస్టు రికార్డు దారుణంగా ఉంది. ఈ పద్దెనిమిదేళ్లలో భారత్తో ఇంటా బయటా ఏడు సిరీస్ల్లో తలపడింది. 2001-02లో మాత్రమే అదీ సొంతగడ్డపై 2-1తో నెగ్గింది. తర్వాతి ఆరు సిరీస్లను ఒక్క విజయం లేకుండానే కోల్పోయింది.
ఈ రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇరు జట్ల ఆటగాళ్ల కోసం పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దామా....
49 - విండిస్ తరుపున బ్రాత్వైట్ ఇప్పటివరకు 49 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. 37.94 యావరేజితో 3,263 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి.
97 - తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మహ్మద్ సిరాజ్ మరో మూడు వికెట్లు తీస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 100 వికెట్లు తీసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. 20 ఫస్ట్ క్లాస్ గేమ్స్లో 18.92 యావరేజితో సిరాజ్ 97 వికెట్లు పడగొట్టాడు.
198 - అంతర్జాతీయ క్రికెట్లో విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఇప్పటివరకు 198 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 81, వన్డేల్లో 110, టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషు మరో మూడు వికెట్లు తీస్తే 150 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు.
493 - టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఏడు వికెట్లు తీస్తే 500 వికెట్లు అతడి ఖాతాలో చేరతాయి. ఇక, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో ఒక పరుగు తీస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 5000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
1811 - టెస్టు క్రికెట్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మరో 189 పరుగులు చేస్తే 2000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఇదే మైలురాయిని అందుకోవడానికి వెస్టిండిస్ బ్యాట్స్ మన్ కీరన్ పొలార్డ్ 119 పరుగుల దూరంలో ఉన్నాడు.
2921 - సొంతగడ్డపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చేసిన పరుగులు. కోహ్లీ మరో 79 పరుగులు చేస్తే సొంతగడ్డపై 3000 పరుగులు సాధించిన 11వ భారత క్రికెటర్గా అరుదైన ఘనత సాధిస్తాడు.
4809 - ఇప్పటివరకు ఛటేశ్వర్ పుజారా టెస్టుల్లో సాధించిన పరుగులు. మరో 181 పరుగులు చేస్తే, 5000 పరుగుల మైలురాయిని అందుకున్న 12వ భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. అలాగే మరో 199 పరుగులు చేస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పుజారా 14,000 పరుగులు పూర్తి చేసుకుంటాడు.