ముంబై: ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్-2019లో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ కేదార్ జాదవ్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై విమర్శల వర్షం కురిసింది. మెగా టోర్నీ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్లకు టీమిండియా జట్టులో చోటు దక్కలేదు. అయితే అనూహ్యంగా ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్లో అవకాశం దక్కించుకున్నాడు.
'టీ20 ప్రపంచకప్కు సమయం లేదు.. డివిలియర్స్ త్వరగా రా'
చెన్నై వైదికగా జరిగిన మొదటి వన్డేలో కేదార్ జాదవ్ 35 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఒక ఓవర్ బౌలింగ్ చేసి 11 పరుగులు ఇచ్చాడు. అయితే జాదవ్ మళ్లీ జట్టులోకి రావడంపై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. '2023 ప్రపంచకప్కు సమయం ఉంది. మంచి జట్టును ఇప్పటినుండే తయారు చేసుకోవాలి. ప్రపంచకప్ ప్రణాళికలో జాదవ్ ఉన్నాడా అనేది ఆసక్తికరంగా ఉంది. అతడు ఆ ప్రణాళికలో లేకపోతే.. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని వన్డేల్లో కూడా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి' అని లక్ష్మణ్ అన్నాడు.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ... 'జాదవ్ ఒక ఓవర్ వేసి 11 పరుగులు ఇచ్చాడు. మరో అవకాశం ఇవ్వాల్సింది. ఇలాంటి స్లో పిచ్పై బంతితో ప్రభావం చూపగలడు. కేదార్తో మరిన్ని ఓవర్లు వేయించాల్సింది. అతడు జట్టులో ఉండకూడదని నేను భావించట్లేదు. ఆరో స్థానంలో మనీశ్ పాండే, సంజు శాంసన్కు అవకాశం ఇవ్వాలి. ఆరులో పంత్ కూడా సత్తా చాటగలడు. శివమ్ దూబేకు కూడా హార్దిక్ పాండ్యాలా ఎక్కువ అవకాశాలు ఇస్తే మెరుగవుతాడు' అని హర్భజన్ పేర్కొన్నాడు.
వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యలతో మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ విభేదించారు. 'తొలి వన్డేలో జాదవ్ మంచి ప్రదర్శ చేశాడు. కీలక సమయంలో కీలక పరుగులు జట్టుకు అందించాడు. ఇన్నింగ్స్ చివరి దశలో ఉన్న కారణంగా వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. జాదవ్ తుది జట్టులో కొనసాగవచ్చు. అతడి స్థానంలో ఇతర ఆటగాళ్లను భర్తీ చేయాల్సిన అవసరం లేదు' అని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. తొలి వన్డేలో భారత్ ఓడిపోయినా విషయం తెలిసిందే. విశాఖ వేదికగా బుధవారం రెండో వన్డే జరగనుంది.