రాంచీ: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. 116.3 ఓవర్లలలో భారత్ 497/9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ స్కోర్ 224/3తో ఆదివారం రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ పరుగుల వరద పారించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (212; 255 బంతుల్లో 28x4, 6x6) డబుల్ సెంచరీ చేయగా.. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (115; 192 బంతుల్లో 17x4, 1x6) సెంచరీ చేసాడు. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రోహిత్-రహానే జోడి ఆడుకుంది. ప్రొటీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ నాలుగో వికెట్కు 267 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
IND vs SA: టెస్టు, వన్డేల్లో డబుల్ సెంచరీలు.. మూడో భారత క్రికెటర్గా రోహిత్!!
రోహిత్-రహానే జోడి వేగంగా పరుగులు చేయడంతో భారత జట్టు స్కోర్ 300 పరుగులు దాటింది. వెంటనే లిండే బౌలింగ్లో రహానే.. క్లాసెన్ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా హిట్మ్యాన్కు అండగా నిలిచాడు. దీంతో లంచ్ విరామానికి భారత్ 357/4తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. లంచ్ అనంతరం రోహిత్ డబుల్ సెంచరీ చేసి.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు.
ఈ సమయంలో జడేజా, సాహా కొన్ని విలువైన పరుగులు చేసారు. ఈ క్రమంలో జడేజా (51; 119 బంతుల్లో 4x4) అర్ధ సెంచరీ చేసాడు. జడేజా, సాహా (24) ఔట్ అయినా.. చివర్లో ఉమేశ్ యాదవ్ (31; 10 బంతుల్లో 5x6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 10 బంతుల్లో ఓవరాల్గా ఐదు సిక్సర్లు కొట్టిన ఉమేశ్.. తొమ్మిదో వికెట్గా ఔటయ్యాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 497/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. భారత్ తన ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసే సమయానికి షమీ (10 నాటౌట్), నదీమ్ (1 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే నాలుగు, రబాడ మూడు వికెట్లు తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. భారత పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ రెండో బంతికి డీన్ ఎల్గర్ (0) పెవిలియన్ చేరాడు. షమీ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికి కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చాడు. ఉమేష్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి డికాక్ (4) సాహాకే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ (1), హంజా (0)లు ఉన్నారు. దక్షిణాఫ్రికా 5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది.