హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ని భారత జట్టు మేనేజ్మెంట్ బలిపశువుగా చూస్తోందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో ఓపెనర్ శిఖర్ ధావన్, సాహా, భువనేశ్వర్ కుమార్లను తుది జట్టు నుంచి జట్టు మేనేజ్మెంట్ తప్పించిన సంగతి తెలిసిందే.
వీరి స్థానంలో కేఎల్ రాహుల్, పార్థీవ్ పటేల్, ఇషాంత్ శర్మలకి చోటు కల్పించింది. ఈ ఎంపిక ఎంతమాత్రం సరిగా లేదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే.. మొదట శిఖర్ ధావన్ పేరే వినిపిస్తోందని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
"జట్టులో శిఖర్ ధావన్ బలి పశువుగా తయారయ్యాడు. వేటు వేయాలనుకుంటే తొలుత అతని పేరే వినిపిస్తోంది. నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అతను తొలి టెస్టులో మొదటి సెషన్లోనే మూడు వికెట్లు తీశాడు. మొత్తంగా ఆరు వికెట్లతో సత్తా చాటాడు" అని అన్నాడు.
"ఇషాంత్ కచ్చితంగా జట్టులో ఉండాలని అనుకుంటే షమీ లేదా బుమ్రాపై వేటు వేయచ్చు. కానీ.. అలా జరగలేదు. ఎందుకో?" అని సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు. ఒక టెస్టులో విఫలమవగానే ధావన్పై వేటు వేయడంలో అంతర్యం అర్థంకావడం లేదని.. సాహాకి గాయం కారణంగా పార్థీవ్ని జట్టులోకి తీసుకున్నామనే మాటలో వాస్తవమెంతో తెలియాల్సి ఉందని సన్నీ తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.