

హైదరాబాద్: జోహెన్స్బర్గ్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన ఫీల్డింగ్తో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాడు.
సఫారీ బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్ బాదిన భారీ షాట్ను ఆపే యత్నంలో బుమ్రా బౌండరీ లైన్ వద్ద చేసిన ఫీట్ అబ్బురపరిచింది. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.
అయితే, టీమిండియా బౌలర్ హార్దిక్ పాండ్యా వేసిన ఏడో ఓవర్ తొలి బంతిని మిల్లర్ మిడిల్ అండ్ లెగ్ మీదుగా షాట్ కొట్టాడు. అయితే ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా గాల్లోకి ఎగురుతూ బంతిని పట్టుకున్నాడు. బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో బంతిని విసిరేసి బౌండరీ లైన్పై పడ్డాడు.
కానీ దానిని సిక్సర్గా థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ఇటీవల క్రికెట్లో మార్చిన నిబంధనల ప్రకారం తొలుత ఒకసారి బౌండరీ లైన్ తాకి ఆపై గాల్లో క్యాచ్ పట్టి విసిరేసినా అది సిక్సర్గానే పరిగణిస్తారు. దీంతో బుమ్రా ఒకింత నిరాశకు గురయ్యాడు. అయినప్పటికీ బుమ్రా అద్భుతమైన ఫీల్డింగ్కు అభిమానులు ఫిదా అయ్యారు.