తొలి మూడు వన్డేల్లో విజయం
సుదీర్ఘ పర్యటన కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సఫారీ గడ్డపై గతేడాది డిసెంబర్లో అడుగుపెట్టింది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 2-1తో చేజార్చుకుంది. ఇదే వేదికగా జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన విజయం సాధించి అంతే ఆత్మవిశ్వాసంతో వరుసగా తొలి మూడు వన్డేల్లో విజయం సాధించింది. డర్బన్, సెంచూరియన్, కేప్టౌన్ వన్డేల్లో విజయం సాధించి వన్డే సిరిస్పై పట్టు సాధించింది.
పింక్ వన్డేలో భారత్ ఓటమి
అయితే, జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన పింక్ వన్డేలో వర్షం కారణంగా డక్ లూయిస్ పద్ధతిలో భారత జట్టు ఓటమి పాలైంది. ఆ తర్వాత ఐదో వన్డే జరిగే పోర్ట్ ఎలిజబెత్లో భారత జట్టుకు పేలవ రికార్డు అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే, గత రికార్డులను బద్దలు కొడుతూ ఐదో వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై 73 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ను 4-1తో కోహ్లీసేన కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
రెట్టింపు ఉత్సాహంతో కోహ్లీసేన ఆరో వన్డేకు
సఫారీ గడ్డపై వన్డే సిరిస్ గెలిచి పాతికేళ్ల నిరీక్షణకు తెరదించింది. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో కోహ్లీసేన ఆరో వన్డేకు సిద్ధమవుతుండగా, దక్షిణాఫ్రికా మాత్రం చివరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఇప్పటికే వన్డే సిరిస్ను కైవసం చేసుకోవడంతో చివరి వన్డేలో కోహ్లీసేన తుది జట్టులో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. నామమాత్రమైన వన్డే కావడంతో రిజర్వ్ బెంచ్ బలం పరీక్షించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి భావిస్తున్నారు. దీంతో అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్లు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆరో వన్డేలో స్వల్ప మార్పులు
ఐదో వన్డే విజయానంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తమ జట్టులో కొన్ని మార్పులతో ఆరో వన్డేలో బరిలోకి దిగుతామని, అయితే, తమ లక్ష్యం మాత్రం విజయం సాధించడంపైనే ఉంటుందని స్పష్టం చేశాడు. ప్రత్యర్థిపై 4-1 తేడాతో గెలుపొందిన ఉత్సాహం ఉన్నా, 5-1 తేడాతో సిరిస్ను సొంతం చేసుకోవడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నాడు.
అరుదైన రికార్డుకి చేరువలో కుల్దీప్
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరుదైన ఘనతకు చేరువలో ఉన్నారు. ఈ సిరిస్లో ఇప్పటివరకు భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీసిన వికెట్లు 16. మరో మూడు వికెట్లు తీస్తే ఓ ద్వైపాక్షిక వన్డే సిరిస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. టీమిండియా మాజీ క్రికెటర్లు జవగళ్ శ్రీనాథ్, అమిత్ మిశ్రాలు 18 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. వెస్టిండిస్ పేసర్ ప్యాట్రిక్ పాట్రిసన్, సఫారీ మాజీ పేసర్ గ్రెగ్ మాథ్యూస్ 17 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
33 పరుగుల దూరంలో ధోని
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ధోని వన్డే పరుగులు 9,898. పదివేల పరుగుల మైలురాయిని ధోని సునాయాసంగా చేరుకుంటాడని అంతా భావించారు. ఐదు వన్డేలు ముగిసినా పది వేల పరుగుల మైలురాయిని అందుకోలేకపోయాడు. నాలుగో వన్డేలో 42 పరుగులు మినహా ధోని పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సిరీస్లో ఇప్పటివరకూ ధోని 69 పరుగులు మాత్రమే చేశాడు. ఫలితంగా పదివేల పరుగుల మార్కుకు 33 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ప్రస్తుతానికి ధోని వన్డేల్లో 9,967 పరుగులతో ఉన్నాడు.
టీమిండియాను ఊరిస్తోన్న మరో రికార్డు
ఆరో వన్డేలో టీమిండియాను మరో రికార్డు ఊరిస్తోంది. ఆరో వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే సఫారీ గడ్డపై అరుదైన ఘనతను సొంతం చేసుకుంటుంది. సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాపై ఓ ద్వైపాక్షిక సిరిస్లో ఐదు వన్డేలు గెలిచిన రెండో జట్టుగా అరుదైన ఘనత సాధిస్తుంది. అంతకముందు ఈ ఘనతను 2001-2002లో ఆస్ట్రేలియా సాధించింది.
జట్ల వివరాలు:
భారత్:
కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్య, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, షమి, శార్దూల్ ఠాకూర్
దక్షిణాఫ్రికా: అయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హషీమ్ ఆమ్లా, జేపీ డుమిని, డేవిడ్ మిల్లర్, ఏబీ డివిలియర్స్, మోర్నీ మోర్కెల్, లుంగి ఎంగిడి, అండిలే ఫెలుక్వాయే, రబాడ, తబ్రైజ్ షంషీ, హెన్రిచ్ క్లాసెన్,
Match starts at: 4:30 pm IST
Live on: Sony TEN 1, Sony TEN 1 HD