రాంచీ: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే 100 (169 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీ చేసాడు. 69వ ఓవర్ వేసిన పేసర్ నోర్జే బౌలింగ్లో సింగల్ తీసి రహానే సెంచరీ పూర్తి చేసాడు. టెస్టుల్లో రహానేకు ఇది 11వ సెంచరీ. గత కొంత కాలంగా సెంచరీ చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రహానే.. గత విండీస్ పర్యటనలో సెంచరీ చేసి ఫామ్ అందుకున్నాడు. అదే ఫామ్ దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా కొనసాగిస్తున్నాడు. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఆదుకున్నాడు.
ప్రొ కబడ్డీ: ఫైనల్లో ఢిల్లీపై బెంగాల్ జయభేరి.. తొలిసారి టైటిల్ సొంతం
ఓవర్ నైట్ స్కోర్ 224/3తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ దూకుడుగా ఆడుతోంది. రోహిత్ శర్మ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. ఎంగిడి వేసిన ఓ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి ఊపుమీదున్నాడు. మరోవైపు రహానే కూడా చెత్త బంతులను బౌండరీలు బాది సెంచరీ చేసాడు. టెస్టుల్లో రహానేకు ఇది 11వ సెంచరీ. దక్షిణాఫ్రికాపై మూడో సెంచరీ. రహానే సెంచరీ అనంతరం రోహిత్ కూడా 150 మార్క్ అందుకున్నాడు. రోహిత్ రహానే ఇప్పటికే 250 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
రోహిత్ రహానే జోడీని విడదీయడానికి సఫారీ బౌలర్లు అష్టకష్టాలు పడుతున్నారు. కెప్టెన్ డుప్లెసిస్ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు వచ్చిన అవకాశాలను ప్రొటీస్ ఫీల్డర్లు చేజార్చుతున్నారు. సెంచరీ అనంతరం రహానే స్టంపౌట్ నుండి బయటపడ్డాడు. భారత్ 74 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. రహానే (106), రోహిత్ (166) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Well played @ajinkyarahane88 💪💪 pic.twitter.com/42iiOyZtZ9
— BCCI (@BCCI) 20 October 2019
తొలి రెండు టెస్టుల తరహాలోనే మూడో మ్యాచ్లోనూ తొలి రోజు భారత్ పట్టు నిలబెట్టుకుంది. శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ 58 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (164 బంతుల్లో 117 బ్యాటింగ్; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించగా.. అజింక్య రహానే (135 బంతుల్లో 83; 11 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. వర్షం, వెలుతురు లేమి కారణంగా టీ విరామం తర్వాత కొద్ది సేపటికే అంపైర్లు ఆటను నిలిపివేశారు. దాంతో మరో 32 ఓవర్ల ఆటను కోల్పోవాల్సి వచ్చింది. మయాంక్ అగర్వాల్ (10), పుజారా (0), విరాట్ కోహ్లీ (12) తక్కువ పరుగులకే వెనుదిరిగారు.