కోహ్లీకి కీలకం
రెండు దేశాలకు చెందిన కోట్లాదిమంది ప్రజలు ఈ మ్యాచ్ను చూడటానికి టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. విరాట్ కోహ్లీకి ఈ టోర్నమెంట్ అత్యంత కీలకం. టీమిండియా టీ20 కేప్టెన్గా అతనికి ఇది చిట్టచివరి టోర్నమెంట్. ఈ టోర్నీ తరువాత అతను కేప్టెన్సీకి గుడ్బై చెప్పబోతోన్నాడు. వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మట్లకు కేప్టెన్గా కొనసాగుతాడు. టీ20 సారథిగా బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.
వారసుడిగా రోహిత్ శర్మ..
విరాట్ కోహ్లీ స్థానంలో ప్రస్తుత వైస్ కేప్టెన్, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ.. బాధ్యతలను స్వీకరిస్తాడు. ఈ టోర్నమెంట్ ముగిసిన అతి కొద్ది రోజుల్లోనే ఈ కేప్టెన్సీ మార్పు అనేది చోటు చేసుకోవచ్చు. అదే సమయంలో విరాట్ కోహ్లీ- తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా వైదొలగుతాడు. కాగా- టీ20 కేప్టెన్గా విరాట్ కోహ్లీ తన చిట్ట చివరి టోర్నమెంట్ను ఇవ్వాళ ఆరంభించనున్నాడు. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొట్టబోతున్నాడు.
కోహ్లీ చేతుల్లోనే..
ఏ మాత్రం తేడా కొట్టినా విరాట్ కోహ్లీకి ఓ పీడకలగా మారిపోయే టోర్నమెంట్ ఇది. ఈ మెగా ఈవెంట్ను చిరస్మరణీయంగా మలచుకోవాలన్నా, పీడకలగా మిగిల్చుకోవాలనుకున్నా అది కోహ్లీ చేతుల్లో ఉంది. ఎందుకంటే- జట్టుకు అతనే సారథిగా ఉన్నాడు గనక. ఒకవంక దాయాది పాకిస్తాన్పై ఘన విజయాన్ని సాధించడం, అదే ఊపును, దూకుడును టోర్నమెంట్ ఫైనల్ వరకు తీసుకెళ్లడం, దాన్ని విజయంగా మలచుకోవడం కోహ్లీ చేతుల్లోనే ఉంది. ఏ రకంగా చూసినా విరాట్ కోహ్లీకి ఇది అత్యంత కీలకమైన మ్యాచ్.. మ్యాచ్ మాత్రమే కాదు టోర్నమెంట్ కూడా.
అండగా ధోనీ
మరోవంక అతనికి అండగా టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఉన్నాడు. 2007లో నిర్వహించిన ఇదే టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో ఇదే పాకిస్తాన్ను చిత్తు చేసి.. జట్టును ఛాంపియన్గా నిలిపిన చరిత్ర ధోనీకి ఉంది. అతనే ఇప్పుడు టీమిండియాకు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. తన అనుభవాన్ని రంగరించి- జట్టును ఎలా విజయ తీరాలకు చేర్చుతాడు? విరాట్ కోహ్లీ సాధించే జయాపజయాల్లో ధోని పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
పాజిటివ్ వైబ్రేషన్స్..
ఈ టోర్నమెంట్లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగించాలీ అంటే.. తన మొట్టమొదటి మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించి తీరాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించితే.. దానికి సంబంధించిన పాజిటివ్ వైబ్రేషన్స్ టోర్నీ మొత్తం ఉంటాయి. ఆ దూకుడు కొనసాగుతుంది. ఆ ఆత్మవిశ్వాసం జట్టును నడిపిస్తుంది. ఓడిపోతే మాత్రం తేడా కొడుతుంది. వరల్డ్ కప్ టోర్నమెంట్లలో ఏనాడూ పాకిస్తాన్ చేతిలో ఓడిపోని చరిత్రకు తెర పడుతుంది. ఫలితంగా ఎదురయ్యే విమర్శలు విరాట్ కోహ్లీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రమాదం ఉంది. మరి విరాట్ కోహ్లీ ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటాడనేది ఈ రాత్రికి తేలిపోతుంది.