అబుధాబి: టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా ఇంకొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. సాయంత్రం 7:30 గంటలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ మొదలవుతుంది. ఈ రెండు జట్లు పరస్పరం పోరాడబోతోండటం.. సుదీర్ఘ విరామం తరువాత ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడేళ్ల తరువాత భారత్-పాకిస్తాన్ జట్లు ముఖాముఖి తేల్చుకోబోతోన్నాయి.
2019లో ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో ప్రపంచకప్ మ్యాచ్ ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ తరువాత మళ్లీ ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. మాంచెస్టర్ మ్యాచ్లో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఆ మాటకొస్తే.. పాకిస్తాన్ జట్టు.. మెన్ ఇన్ బ్లూస్ను ఎప్పుడూ ఓడించనే లేదు. అదే ఆనవాయితీని కొనసాగించడానికి టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ దఫా అయినా భారత్ను ఓడించి.. పరాజయాల పరంపరకు తెర దించాలని పాకిస్తాన్ భావిస్తోంది.
ఈ మ్యాచ్లో గెలిచి తీరాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఆ దేశానికి చెందిన ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటున్నారనడానికి తాజా ఉదాహరణ ఒకటి దుబాయ్ స్టేడియంలో చోటు చేసుకుంది. పాకిస్తాన్కు చెందిన మహిళా జర్నలిస్ట్ సవేరా పాషా ఓ వింత కోరిక కోరారు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ను కవరేజ్ చేయడానికి దుబాయ్కు వచ్చారామె. తన విధి నిర్వహణలో భాగంగా శనివారం రాత్రి దుబాయ్ స్టేడియంలో భారత జట్టు ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్ను కవర్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె టీమిండియా మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీ, డాషింగ్ ఓపెనర్ కేఎల్ రాహుల్కు ఓ వింత కోరికను కోరారు. ఆమె కోరిన ఈ కోరిక.. పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు, ప్రజల మనోభావాలను ప్రతిబింబించినట్టయింది. ప్రాక్టీస్ సెషన్స్ను ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్కు బయలుదేరిన టీమిండియా క్రికెటర్లను ఉద్దేశించి ఆమె ఈ కోరిక కోరారు. జట్టు ప్లేయర్లు వరుసగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తోన్న దృశ్యాన్ని తన మొబైల్లో షూట్ చేశారు.
banter with KL Rahul & MS Dhoni.. Interesting response from MSD 🤪 #INDvPAK #T20WorldCup pic.twitter.com/5K9zDGsPCi
— Sawera Pasha (@sawerapasha) October 23, 2021
తనకు ఎదురుగా కనిపించిన కేఎల్ రాహుల్ను ఉద్దేశించి- రాహుల్, ప్లీజ్ డోన్ట్ గో ప్లే టుమారో.. అంటూ రిక్వెస్ట్ చేశారు. సరిగ్గా ఆడొద్దంటూ నవ్వుతూ విజ్ఞప్తి చేశారు. డోన్ట్ ప్లే టుమారో అంటూ పదేపదే కోరారు. ఆ వెనుకలే ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి వస్తోన్న మహేంద్ర సింగ్ ధోనీ కనిపించడతో అతణ్ని కూడా అదే కోరిక కోరారు. మహీ.. ఈ మ్యాచ్ను వదిలేయండి.. ఎలాంటి మాయాజాలాన్ని (టాక్టిస్)ను ప్రదర్శించవద్దు అని కోరారు. కావాలంటే.. తరువాతి మ్యాచ్కు ఈ టాక్టిస్ను ప్రదర్శించవచ్చిన విజ్ఞప్తి చేశారు. ఈ మ్యాచ్ను మాత్రం వదిలేయాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.