రహానే, విహారి విఫలం:
ఓవర్నైట్ స్కోరు 144/4తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. కివీస్ పేసర్ల ధాటికి కుదేలైంది. ఓవర్నైట్ స్కోరుకు కేవలం 47 పరుగులు మాత్రమే జోడించి చివరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. అజింక్య రహానే (29), హనుమ విహారి (15) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. 148 పరుగుల వద్ద అజింక్యా రహానె(29) బౌల్ట్ చేతికి చిక్కాడు. అనంతరం 148 పరుగుల వద్దనే హనుమ విహారి (15) సౌథీ బౌలింగ్లో ఔటయ్యాడు.
చెలరేగిన సౌథీ:
అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (41 బంతుల్లో 25) కాసేపు కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కాసేపటికి సౌథీ బౌలింగ్లో బౌల్ట్కు పంత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరుగడంతో భారత లోయర్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. దీంతో భారత్ ఓటమి లాంఛనమైంది. మయాంక్ అగర్వాల్ (58) మాత్రమే రాణించాడు. కివీస్ బౌలర్లలో సౌథీ చెలరేగి ఐదు వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. మొదటి ఇన్నింగ్స్లోనూ సౌథీ నాలుగు వికెట్లు తీసి మొత్తంగా 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బౌల్ట్ రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీశాడు.
10 బంతుల్లోనే విజయం:
అనంతరం 9 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 1.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఇషాంత్ శర్మ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ టామ్ లాతమ్ బౌండరీతో సహా 8 పరుగులు చేసాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ టామ్ బ్లండెల్ సింగల్ తీసి లాంఛనం పూర్తిచేసాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్లో కివీస్ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 29న ప్రారంభం కానుంది.
ఇన్నింగ్స్ వివరాలు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 165ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్: 191 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్: 348 ఆలౌట్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 9 పరుగులు (వికెట్ నష్టపోకుండా)