ముంబై: గతంలో చేసిన తప్పుల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నా. నా ఆత్మవిశ్వాసం, సానుకూలత, అభిరుచితో భారత్ ప్రపంచకప్ గెలిచేందుకు సాయపడగలను అని యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ అన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో పర్వాలేదనిపించిన శార్దూల్.. వన్డే సిరీసులో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. వరుసగా 80, 60, 87 రన్స్ ఇచ్చాడు. ఇక మూడు వన్డే మ్యాచ్లలో 4 వికెట్లు పడగొట్టాడు.
India vs New Zealand: న్యూజిలాండ్తో తొలి టెస్ట్.. కోహ్లీకి బౌల్ట్ హెచ్చరికలు!!
టీ20, వన్డే సిరీస్లు పూర్తయిన నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ భారత్ తిరిగి వచ్చాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శార్దూల్ మాట్లాడుతూ... 'ఇప్పుడు నా దృష్టంతా టీ20 ప్రపంచకప్పైనే ఉంది. నా ఆత్మవిశ్వాసం, సానుకూలత, అభిరుచితో భారత్ ప్రపంచకప్ గెలిచేందుకు సాయపడగలను. ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లే ముందు గాడిలో పడేందుకు ఐపీఎల్ కచ్చితంగా ఉపయోగపడుతుంది' అని అన్నాడు.
'త్వరలో శ్రీలంకతో టీ20లు ఆడుతాం. ఐపీఎల్ తర్వాత జింబాబ్వేకు వెళ్తున్నాం. ఇంకా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉంది. నా పొరపాట్లను గుర్తిస్తా. నేర్చుకొనేందుకు అవి ఉపయోగపడతాయని నా నమ్మకం. న్యూజిలాండ్కు వెళ్లడం నాకిదే మొదటిసారి. ఇతరులతో పోలిస్తే అక్కడ ఆడిన అనుభవం చాలా తక్కువ. వచ్చే రోజులలో జట్టు కోసం ఉపయోగపడతా. ఎక్కువ పరుగులు ఇస్తే ఫర్వాలేదు. ప్రతిసారీ అద్భుతంగా బౌలింగ్ వేయలేం కదా' అని శార్దూల్ పేర్కొన్నాడు.
'ఒక ఓవర్లో 20 పరుగులు ఇస్తే.. తర్వాత 16, 14 ఇలా ఇంకా తక్కువ పరుగులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. మేం ఆఖరి ఓవర్లలోనూ పరుగులను కాపాడుకోగలుగుతున్నాం. అదే తొలుత బౌలింగ్ చేస్తే.. పరుగులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నా. నేను బ్యాటింగ్ చేయగలనని ఎప్పుడూ నమ్ముతాను. ఆ పరుగులు జట్టుకు కచ్చితంగా సాయపడతాయి. బ్యాటింగ్ ఆర్డర్ ఏదైనా పరిస్థితికి తగినట్టు పరుగులు చేస్తా' అని శార్దూల్ చెప్పుకొచ్చాడు.