

హైదరాబాద్: కివీస్తో ఆదివారం జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్లో దినేశ్ కార్తీక్ చేసిన చిన్న తప్పిదం కారణంగా భారత్కి మ్యాచ్ దూరమైందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చివరి మూడు ఓవర్లలో విజయానికి 48 పరుగులు అవసరమైన సమయంలో భారత్ పోరాడిన తీరు అసాధారణం.
భారత్ విజయానికి ఆఖర్లో 28 బంతుల్లో 68 పరుగులు అవసరంకాగా.. అప్పటికే ఆరు వికెట్లు చేజారడంతో న్యూజిలాండ్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. దినేశ్ కార్తీక్ (33 నాటౌట్), కృనాల్ పాండ్య (26 నాటౌట్) జోడీ అసాధారణ హిట్టింగ్తో భారత్ను లక్ష్యానికి చేరువ చేశారు. కానీ, ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అసరమైన దశలో కార్తీక్ చిన్న తప్పిదం కారణంగా మ్యాచ్ చేజారిందని అన్నాడు.
"దినేశ్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ.. టీ20ల్లో చిన్న తప్పిదాలే మ్యాచ్పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఆఖరి ఓవర్లో దినేశ్ కార్తీక్ సింగిల్ తీసేందుకు నిరాకరించడమే అతను చేసిన పెద్ద తప్పిదం" అని మంజ్రేకర్ ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దీంతో మూడో టీ20లో భారత క్రికెట్ జట్టు 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో న్యూజిలాండ్లో తొలిసారి టీ20 సిరీస్ సాధించాలనుకున్న భారత్ ఆశలు తీరలేదు. మూడు టీ20ల సిరిస్ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది.
ఆఖరి టీ20లో భారత్ గెలువాలంటే 12 బంతుల్లో 30 పరుగులు చేయాలి. క్రీజ్లో ఉన్న కృనాల్ పాండ్యా, దినేశ్ కార్తీక్లు చెలరేగి బ్యాటింగ్ చేశారు. సౌతీ వేసిన 18 ఓవర్లో 18 పరుగులు పిండుకుని స్కోరు బోర్డులో వేగం పెంచారు. ఇది పెద్ద లక్ష్యం కూడా కాకపోవడంతో... టీమిండియా గెలుపు ఖాయమే అనుకున్నారు. అనుకున్నట్లుగానే చెరో సిక్స్ బాదడంతో 19వ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి.
విజయ సమీకరణం 6 బంతుల్లో 16 పరుగులుగా మారింది. భారత్ జోడి ఊపును చూసి 16 పరుగుల్ని సాధించడం ఏమంత కష్టం కాదనిపించింది. దీంతో టీమిండియాదే విజయం అని అంతా భావించారు. అయితే, క్రీజులో ఉన్న దినేశ్ కార్తీక్ అతి విశ్వాసం మ్యాచ్నే చేజారేలా చేసింది. అదేలాగంటే ఆఖరి ఓవర్ వేసేందుకు సౌతీ బంతిని అందుకున్నాడు. తొలి బంతికి కార్తీక్ రెండు పరుగులు తీశాడు.
ఇక కావాల్సింది 5 బంతుల్లో 14 పరుగులు. రెండు బంతికి పరుగులేమీ తీయలేదు. బంతి బాగా ఆఫ్ స్టంప్కు వేయడంతో దినేశ్ కార్తీక్ హిట్ చేసేందుకు తటపటాయించాడు. అది వైడ్ అవుతుందనే ధీమాతో దినేశ్ కార్తీక్ ఆ బంతిని లైట్ తీసుకున్నాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వలేదు. దీనిపై ఫీల్డ్ అంపైర్ను కార్తీక్ అడిగినా నిరాశే ఎదురైంది. 4 బంతుల్లో 14 పరుగులు కావాలి. మూడో బంతిని కార్తీక్ లాంగాన్ వైపు కొట్టినా సింగిల్ తీయలేదు.
కృనాల్ సింగిల్ కోసం అవతలి వైపు చేరుకున్నా.. అతి ఆలోచనతో కార్తీక్ పరుగు తీయలేదు. దాంతో భారత్కు మూడు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. కానీ, నాలుగో బంతి బౌన్సర్ కావడంతో దీనిని ఊహించని కార్తీక్ సింగిల్ తీశాడు. ఇక, ఐదో బంతిని కృనాల్ సింగిలే తీశాడు. ఇక ఆరో బంతి వైడ్ కావడంతో భారత్ ఖాతాలో పరుగు చేరగా, కివీస్ మరో బంతి వేయాల్సి వచ్చింది.
అయితే ఆఖరి బంతిని కార్తీక్ సిక్స్ కొట్టాడు. దీంతో ఆఖరి ఓవర్లో టిమ్ సౌధీ 2, 0, 0, 1, 1, Wd, 6 రూపంలో కేవలం 11 పరుగులే ఇచ్చాడు. దీంతో.. 4 పరుగుల తేడాతో భారత్ ఓడింది. అలా కాకుండా మూడో బంతికి దినేశ్ కార్తీక్ సింగిల్ తీసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.