హామిల్టన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ హామిల్టన్లోని సెడాన్ పార్క్లో ప్రారంభం అయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా బ్యాటింగ్కు దిగింది. గాయాల కారణంగా రెగ్యులర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ దూరమవడంతో.. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగారు. టీమ్ సౌథీ వేసిన తొలి ఓవర్ను పృథ్వీ షా మెయిడిన్ చేసాడు. మూడో ఓవర్లో మయాంక్ బౌండరీ బాదాడు. ఆపై షా రెండు ఫోర్లు బాది స్కోర్ బోర్డును పరుగెత్తించాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్.. ఓపెనర్లుగా పృథ్వీ, మయాంక్ అరంగేట్రం!!
పృథ్వీ, మయాంక్ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ 50 పరుగుల భాగస్వామ్యంను అందించారు. ఈ క్రమంలో కొలిన్ డి గ్రాండ్హోమ్ బౌలింగ్లో పృథ్వీ (20) షాట్కు ప్రయత్నించి కీపర్ లాతమ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లో సౌథీ బౌలింగ్లో ఫోర్ బాడి ఊపుమీదున్న మయాంక్ (32) మరో బౌండరీకి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (14), శ్రేయాస్ అయ్యర్ (1)లు ఉన్నారు. భారత్ 14 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.
తొలి వన్డేలో భారత ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఓ అరుదైన రికార్డు నమోదు చేశారు. భారత్ తరఫున ఇద్దరు ఓపెనర్లు షా, మయాంక్ ఒకేసారి వన్డేల్లో అరంగేట్రం చేశారు. ఒకే మ్యాచ్లో ఇద్దరు ఓపెనర్లు అరంగేట్రం చేయనుండటం భారత్ క్రికెట్ చరిత్రలో ఇది నాలుగోసారి కావడం విశేషం. గతంలో లోకేష్ రాహుల్, కరుణ్ నాయర్ (2016లో జింబాబ్వేపై).. సునీల్ గవాస్కర్, సుధీర్ నాయక్ (1974లో ఇంగ్లండ్పై).. పార్థసారథి శర్మ, దిలీప్ వెంగ్సర్కార్ (1976లో న్యూజిలాండ్పై) అరంగేట్రం మ్యాచ్ల్లో ఓపెనింగ్ చేశారు.
టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ గాయాలతో కివీస్ టూర్ నుంచి వైదొలగడంతో.. పృథ్వీ షా, మయాంక్లను భారత్ కొత్త ఓపెనర్లుగా బరిలో దింపింది. క్రీజులో కుదురుకున్న షా (20), మయాంక్ అగర్వాల్ (32) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు.