జట్టు కూర్పులో పలు మార్పులు:
ఈ ఏడాదిలో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈ టీ20 సిరీస్ను సద్వినియోగం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మెగా టోర్నీ కోసం కోహ్లీసేన ఇప్పటినుండే వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా జట్టు కూర్పులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో. వికెట్ కీపర్గా లోకేష్ రాహుల్ సక్సెస్ అవ్వడంతో.. యువ వికెట్ కీపర్లు సంజూ శాంసన్, రిషభ్ పంత్ తుది జట్టులో ఆడకపోవచ్చు.
రాహుల్ ఓపెనింగ్:
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్కు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ తిరిగి జట్టుతో చేరాడు. భుజ గాయం కారణంగా శిఖర్ ధావన్ దూరమవడంతో.. రోహిత్తో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు వస్తారు. ఈ జోడి ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. ఇక కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా.. జట్టుకు విజయాన్ని అందిస్తాడు.
బెంచ్కే శాంసన్, పంత్:
మనీశ్ పాండేపై కూడా జట్టు యాజమాన్యం భారీగా నమ్మకం పెట్టుకుంది. మరోవైపు వచ్చిన అవకాశాల్ని పాండే కూడా ఉపయోగించుకుంటున్నాడు. అయితే పాండేపై మరింత స్పష్టత వచ్చేందుకు స్పెషలిస్టు కీపర్ను జట్టులోకి తీసుకోవడానికి టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపడంలేదని తేలుస్తోంది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో మిడిలార్డర్ను బలోపేతం చేసే ఉద్దేశంతో పాండేకు అవకాశాలు ఇవ్వాలని చూస్తోంది. కీపర్గా రాహుల్ ఎందుకు ఉండకూడదు అన్న కెప్టెన్ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో శాంసన్, పంత్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది.
ఆరుగురు బౌలర్లతో బరిలోకి:
తొలి టీ20లో ఆరుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగాలని కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నాడు. పేస్ విభాగంలో జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీలు జట్టులో ఖాయం. స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు పక్కాగా చోటు దక్కించుకుంటారు. మరో స్పిన్నర్గా యజ్వేంద్ర చహల్ జట్టులో ఉండే అవకాశం ఉంది. సుందర్, శార్దూల్, జడేజాలు బ్యాటింగ్ కూడా చేయగలరు కాబట్టి ఆరుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయానికి పరిస్థితిని బట్టి కోహ్లీ తుది జట్టులో ఒకటి రెండు మార్పులు చేసినా చేయొచ్చు.
తుది జట్టు:
రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ.