అదిరే ఆరంభం
భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్కు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోలస్ చక్కని భాగస్వామ్యంతో గట్టి పునాది వేశారు. భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ సహనాన్ని పరీక్షించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 85 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే క్రమంలో గప్టిల్ (32) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే టామ్ బ్లండెల్ (9) కూడా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో రాస్ టేలర్ అండతో నికోలస్ హాఫ్ సెంచరీ చేసాడు. అనవసర పరుగు కోసం ప్రయత్నించిన నికోలస్ (78)ను విరాట్ కోహ్లీ రనౌట్ చేసాడు. దీంతో కివీస్ ఒత్తిడిలో పడింది.
టేలర్ సెంచరీ
అయితే ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడిన రాస్ టేలర్ 45 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు టామ్ లాథమ్ అతడికి చక్కని సహకారం అందించాడు. ధాటిగా ఆడిన లాథమ్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. ఈ జోడి కివీస్ జట్టును విజయం దిశగా తీసుకెళ్లింది. అయితే హాఫ్ సెంచరీ అనంతరం లాథమ్ ఔట్ అయ్యాడు. ఈ సమయంలో జిమ్మీ నీశమ్ అండతో టేలర్ అద్భుతంగా ఆడి సెంచరీ చేసాడు.
శాంట్నర్ సూపర్
ఇన్నింగ్స్ చివరలో పుంజుకున్న భారత బౌలర్లు వెంటవెంటనే మూడు వికెట్లు తీయడంతో మ్యాచ్ ఉత్కంఠతకు తెరలేపింది. అయితే టేలర్, శాంట్నర్లు బౌండరీలు బాది లక్ష్యాన్ని కరిగించారు. ఇక మొహమ్మద్ షమీ వేసిన 49వ ఓవర్ తొలి బంతిని ఫైన్లెగ్వైపు తరలించిన టేలర్ కివీస్కు అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్లో కివీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా.. శార్దూల్ ఠాకూర్, షమీ చెరో వికెట్ తీసుకున్నారు. ఐదు టీ20 ల సిరీస్ను 5-0 తేడాతో గెలిచి అదరగొట్టిన టీమిండియా పరిమిత ఓవర్ల ఆటలో మాత్రం కివీస్కు తలవంచింది.
అయ్యర్ సెంచరీ
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (103) తన వన్డే కెరీర్లో తొలి సెంచరీతో మెరవగా.. కేఎల్ రాహుల్ మెరుపు అర్థ శతకాన్ని (88) సాధించాడు. విరాట్ కోహ్లీ (51) అర్థ శతకంతో రాణించాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌధీ 2 వెకెట్లు.. కొలిన్ డి ఇంగ్రామ్, ఇష్ సోదీ చెరో వికెట్ తీశారు. సెంచరీతో అద్భుత విజయాన్ని అందించిన రాస్ టేలర్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. శనివారం ఆక్లాండ్లో రెండో వన్డే జరగనుంది.