
హైదరాబాద్: ధోని కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాత విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వరుస విజయాలతు దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెప్టెన్గా మరో ఆరుదైన ఘనతను సొంతం చేసుకునే అవకాశం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి లభించింది.
ఆగస్టు 1 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్తో ఆరంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ను టీమిండియా గెలిస్తే మాజీ కెప్టెన్లు అజిత్ వాడేకర్, కపిల్దేవ్, రాహుల్ ద్రవిడ్ల సరసన విరాట్ కోహ్లీ చేరనున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా కేవలం మూడు సార్లు మాత్రమే టెస్టు సిరిస్ను నెగ్గింది.
వాడేకర్, కపిల్దేవ్, ద్రవిడ్ సారథ్యంలోనే ఇది సాధ్యమైంది. టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలనందించిన మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, ధోనిలు ఇంగ్లీషు గడ్డపై మాత్రం టెస్టు సిరిస్ను గెలవలేకపోయారు. అయితే, వారిద్దరికీ సాధ్యం కానిది ఇప్పుడు కోహ్లీ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.
అజిత్ వాడేకర్ కెప్టెన్సీలో 1971లో తొలి సారి టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై ఆ దేశాన్ని ఓడించి టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత భారత్కు తొలి వరల్డ్కప్ అందించిన కపిల్దేవ్ సారథ్యంలోనే(1986) మరోసారి ఇంగ్లీషు గడ్డపై సిరీస్ను కైవసం చేసుకుంది. చివరిసారిగా ద్రవిడ్ కెప్టెన్సీలో (2007) మూడో సారి సిరీస్ను నిలబెట్టుకుంది.
ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య 2002లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్, ద్రవిడ్, కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టింది. అయితే ఈ పర్యటనలో గంగూలీ సేన ఐదు టెస్టుల సిరీస్ను డ్రాతో సరిపెట్టుకుంది. అనంతరం 2014లో ధోని కెప్టెన్సీలో ఇంగ్లాండ్ పర్యనటకు వెళ్లిన టీమిండియా చిత్తుగా ఓడింది.