చెన్నై: చెపాక్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా పటిష్ఠమైన స్థితిలో నిలిచింది. మూడో రోజు తొలి సెషన్లో వరుసగా వికెట్లు కోల్పోయినా.. మంచి ఆధిక్యం సంపాదించింది. మూడో రోజు లంచ్ సమయానికి భారత్ 48 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ (34), విరాట్ కోహ్లీ (38) ఉన్నారు. అశ్విన్, కోహ్లీ కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక తొలి ఇన్నింగ్స్ పరుగులు కలుపుకుని ప్రస్తుతం ఓవరాల్గా 351 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం దాదాపు అసాధ్యమేనని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
మూడో రోజైన సోమవారం ఓవర్నైట్ స్కోరు 54/1తో రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు పూర్తిగా సహకరిస్తుండడంతో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగారు. మొదటగా మొయిన్ అలీ బౌలింగ్లో టెస్ట్ స్పెషలిస్ట్ చేటేశ్వర్ పుజారా (7) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన అలీ బౌలింగ్లో క్రీజు వెలుపలికి వచ్చి ఆడడంలో విఫలమయిన పుజారా వెనుదిరిగాడు. ఇక జాక్ లీచ్ బౌలింగ్లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (26) స్టంప్ ఔట్ అయ్యాడు. మరికొద్ది సేపటికే లీచ్ బౌలింగ్లోనే వికెట్ కీపర్ రిషబ్ పంత్ (8) కూడా స్టంప్ ఔట్గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ తొలి సెషన్లో వరుసగా వికెట్లు కోల్పోయింది.
వైస్ కెప్టెన్ అజింక్య రహానే (10) రెండు బౌండరీలు బాది మంచి ఊపులో కనిపించాడు. అయితే మొయిన్ అలీ బౌలింగ్లో ఓలి పోప్కి చిక్కి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆపై ఆడుకుంటాడనుకున్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (7) కూడా నిరాశపరిచాడు. అలీ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. ఒక దశలో 106 పరుగులకే ఆరు వికెట్లు పడినా.. రవిచంద్రన్ అశ్విన్ అండతో జట్టును ఆదుకున్నాడు. అశ్విన్ వేగంగా పరుగులు చేస్తూ.. భారత్ ఆధిక్యంను 350కి చేర్చాడు.
సొంత మైదానమైన చెపాక్ గురించి, అక్కడి పిచ్ గురించి పూర్తి అవగాహన ఉన్న రవిచంద్రన్ అశ్విన్ను పెవీలియన్కు పంపేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయతనాలు విఫలం అయ్యాయి. తనకు అనుకూలంగా ఉన్న బంతులను బౌండరీలకు పంపిన అశ్విన్ ఇప్పటివరకూ 5 ఫోర్లు బాదాడు. పిచ్ స్పిన్నర్లకు పూర్తిగా సహకరిస్తూ ఉండటం టీమిండియాకు లాభించే అంశం. మరో 50 పరుగులు చేసి 400 టార్గెట్ ఇస్తే.. బాగా టర్న్ లభిస్తున్న చెన్నైలో మన స్పిన్నర్లు చెలరేగుతారు. నాలుగు టెస్టుల సిరీస్లో తొలి టెస్ట్ గెలిచి సిరీస్ ముందజలో ఇంగ్లండ్ కొనసాగుతోంది. రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని టీమిండియా ఎదురుచూస్తోంది.
India vs England: రెండో టెస్టుపై ప్రధాని మోదీ ట్వీట్.. ఏమన్నారంటే?