లండన్: ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మ్యాచ్ ఫీజులో ఐసీసీ 15 శాతం కోత విధించింది. నాటింగ్హామ్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ లెవెల్ 1 తప్పిదానికి పాల్పడినట్లు ఐసీసీ అధికారులు గుర్తించారు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో కోత విధించారు.
వివరాల్లోకి వెళితే... భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మూడో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజైన ఆదివారం ఆటలో భాగంగా 92వ ఓవర్లో బ్రాడ్ వేసిన బంతికి అరంగేట్ర ఆటగాడు రిషబ్ పంత్ ఔటయ్యాడు.
పంత్ క్రీజును వదిలి పెవిలియన్కు వెళ్లే సమయంలో స్టువర్ట్ బ్రాడ్ అతని వైపు చూస్తూ ఏవో వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా కెమెరాలో రికార్డు అయింది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం బ్యాట్స్మన్ ఔటనప్పుడు బౌలర్ అలా ప్రవర్తించకూడదు.
దీంతో, ఈ వీడియోని గమనించిన ఐసీసీ దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. బ్రాడ్ను పిలిచి ప్రశ్నించగా తాను వ్యాఖ్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. బ్రాడ్ నేరాన్ని అంగీకరించడంతో మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే, మూడో టెస్టులో కోహ్లీసేన గెలుపు అంచుల్లో నిలిచింది. ఇంకొక్క వికెట్ తీస్తే విజయం భారత్దే. అదే ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ గెలవాలంటే మాత్రం 210 పరుగులు చేయాలి. దీంతో చివరిరోజు టీమిండియా విజయం లాంఛనమే కావచ్చు.
521 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి 311/9తో నిలిచింది. ఏకపక్షంగా సాగిన మూడో టెస్టు నాలుగో రోజు తొలి సెషన్లో ఆతిథ్య జట్టు టాపార్డర్ను కుప్పకూల్చిన భారత బౌలర్లు రెండో సెషన్లో మాత్రం కాస్త నిరాశపరిచారు.
అయితే, చివరి సెషన్లో బుమ్రా (5/85) మ్యాచ్ను చేతుల్లోకి తెచ్చాడు. కానీ రషీద్ (30 బ్యాటింగ్) ఒంటరి పోరాటంతో ఐదో రోజు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంగ్లాండ్ను జోస్ బట్లర్ (106), బెన్ స్టోక్స్ (62) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్తో ఆదుకున్నారు. ప్రస్తుతం క్రీజులో రషీద్ (30), అండర్సన్ (8) పరుగులతో ఉన్నారు.
జస్ప్రీత్ బుమ్రా (5/85) కెరీర్ నాలుగో టెస్టులోనే రెండో సారి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఈ ఇన్నింగ్స్లో లోకేశ్ రాహుల్ నాలుగు క్యాచ్లు పట్టడం విశేషం. ఆగస్టు 30న ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు సౌతాంప్టన్ వేదికగా జరగనుంది.