వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జరగనున్న భారత్ - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లకు వేదికలు ఖరారయ్యాయి. ఇదే విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా ధృవీకరించారు. భారత్ - ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభం అవుతుందని జైషా స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ సిరీస్లో డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు భారత్ - ఇంగ్లాండ్ దేశాల మధ్య డే నైట్ టెస్టు మ్యాచ్ జరుగుతుందని జైషా వివరించారు.
ఇదిలా ఉంటే కరోనావైరస్ కారణంగా భారత్- ఇంగ్లాండ్ దేశాల మధ్య జరగనున్న సిరీస్ యూఏఈకి తరలిపోతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు. రెండు దేశాల మధ్య సిరీస్ భారత్లోనే జరుగుతుందని తద్వారా ఈ సిరీస్ బయట దేశానికి తరలి వెళ్లిపోతుందనే వార్తలకు చెక్ పెట్టారు. కరోనా కారణంగా భారత్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిలిచిపోయాయి. ఇక చాలా రోజుల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ తిరిగి భారత్లో జరుగుతుండటంతో అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన టోర్నమెంట్ చివరిదిగా నిలిచింది. ఇక ఆ తర్వాత మ్యాచ్లు ఏవీ భారత్లో జరగలేదు. ఆ తర్వాత విరాట్ సేన న్యూజిలాండ్ పర్యటన చేసింది. ఆ వెంటనే కరోనావైరస్ విజృంభించడంతో క్రికెట్ యాక్షన్ ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయింది.
ఇక భారత్ ఇంగ్లాండ్ దేశాల మధ్య డే - నైట్ టెస్ట్ మ్యాచ్ మొతేరాలోని కొత్త క్రికెట్ స్టేడియంలో జరుగుతుందని జైషా స్పష్టం చేశారు.అంతేకాదు టీట్వంటీ సిరీస్ మొత్తం కొత్తగా నిర్మించిన మొతేరా క్రికెట్ స్టేడియంలోనే జరుగుతుందని షా చెప్పారు. మొత్తం 5 టీట్వంటీ మ్యాచ్లు ఈ కొత్త స్టేడియంలో జరుగుతాయని షా చెప్పారు. ఈ సిరీస్లో భాగంగా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీట్వంటీ మ్యాచ్లు ఇరు దేశాల మధ్య జరగనున్నాయి.2016 తర్వాత ఇంగ్లాండ్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. 2018 తర్వాత రెండు దేశాల మధ్య సిరీస్ జరగడం కూడా ఇదే తొలిసారి అవుతుంది.
భారత్ - ఇంగ్లాండ్ టెస్ట్ షెడ్యూల్:
తొలి టెస్టు : ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9వరకు చెన్నైలో
రెండో టెస్టు: ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 17వరకు చెన్నైలో
మూడోటెస్టు: ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 28 వరకు అహ్మదాబాదులో: (డే/నైట్)
నాల్గవ టెస్టు: 4 మార్చి నుంచి 8మార్చి వరకు అహ్మదాబాదులో
భారత్ - ఇంగ్లాండ్ T20 మ్యాచ్ షెడ్యూల్ :
తొలి టీట్వంటీ: 12 మార్చి అహ్మదాబాదులో
రెండో టీట్వంటీ: 14 మార్చి అహ్మదాబాదులో
మూడో టీట్వంటీ: 16 మార్చి అహ్మదాబాదులో
నాల్గవ టీట్వంటీ: 18 మార్చి అహ్మదాబాదులో
ఐదవ టీట్వంటీ: 20 మార్చి అహ్మదాబాదులో
భారత్ - ఇంగ్లాండ్ వన్డే షెడ్యూల్:
తొలి వన్డే: 23 మార్చి పూణేలో
రెండో వన్డే: 26 మార్చి పూణేలో
మూడో వన్డే: 28 మార్చి పూణేలో
ఇదిలా ఉంటే కరోనా దెబ్బకు భారీ టోర్నమెంట్లు వాయిదా పడ్డాయి. ఇందులో ఒకటి ఐపీఎల్. ఐపీఎల్ కూడా యూఏఈకి తరలిపోయింది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఐపీఎల్ టోర్నమెంట్ జరిగింది. అనంతరం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇప్పటికే వన్డే మ్యాచులు టీట్వంటీ సిరీస్లు ముగియగా... ఈ నెల 17వ తేదీ నుంచి భారత్ ఆస్ట్రేలియాల మధ్య తొలిటెస్టు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ గెలువగా భారత్ టీట్వంటీ సిరీస్ కైవసం చేసుకుంది.