రహానే ఒక్కడే కాదు
ఈ సిరీస్లో రహానే ఒక్కడే కాకుండా బ్యాట్స్మెన్ అందరూ ఇబ్బందులుపడుతున్నారని రవిశాస్త్రి వెల్లడించాడు. "పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు మానసికంగా ధృడంగా తయారు కావాలి. టెస్టుల్లో రాణించాలంటే బ్యాట్స్మెన్కు మానసిక పరిణతి చాలా అవసరం. జట్టులో నాలుగు మూల స్తంభాల్లో రహానే కూడా ఒకడు. వీలైనంత త్వరగా గాడిలో పడతాడు" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
రెండో స్పిన్నర్ను తీసుకొని తప్పు చేశాం
లార్డ్స్లో రెండో స్పిన్నర్ను తీసుకొని తప్పు చేశామని రవిశాస్త్రి ఈ సందర్భంగా తెలిపాడు. "వాతావరణ పరిస్థితులు చూశాక ఎక్స్ట్రా పేసర్ను తీసుకోవాల్సింది. కానీ మేం తప్పు చేశాం. వర్షం ఎంతసేపు పడుతుందో తెలియదు. మ్యాచ్ చివరి రోజు వరకు వస్తుందని అనుకున్నాం. అప్పుడు రెండో స్పిన్నర్ కచ్చితంగా బంతి టర్న్ చేస్తాడని భావించాం. కానీ ఈ వ్యూహం మమ్ముల్ని దెబ్బతీసింది. సీమర్ను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉండేది" అని అన్నాడు.
|
అప్పుడు మేం బాగానే పుంజుకున్నాం
"మనల్ని మనం నమ్ముకుంటే సరి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కచ్చితంగా పోరాడొచ్చు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఒకటి, రెండుసార్లు ఎదురయ్యా. అప్పుడు మేం బాగానే పుంజుకున్నాం. ఇదే విషయాన్ని ఆటగాళ్లకూ చెప్పా. లార్డ్స్లో ఏం జరిగిందనేది పక్కనబెడితే.. మనం ఎలా ఆడామన్నది ముఖ్యం. ఈ విషయంలో చాలా నిరాశకు గురయ్యాం. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలం.. ఈ జట్టులో నెగెటివ్ ఆలోచనలు లేవు" అని శాస్త్రి పేర్కొన్నాడు.
|
ఫిర్యాదులు భారత జట్టులో లేవు
ఈ మ్యాచ్లో తాను ఎందుకు ఆడటం లేదన్న ఫిర్యాదులు భారత జట్టులో లేవని రవిశాస్త్రి అన్నాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల్లా ఒడిసిపట్టుకోవడమే గొప్ప అన్నాడు. కేవలం క్రికెట్పైనే దృష్టిపెట్టాలని బ్యాట్స్మెన్కు సూచించాడు. మూడో టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తి ఫిట్నెస్ను సాధించాడని రవిశాస్త్రి తెలిపాడు.
స్లిప్లో క్యాచ్లు ప్రాక్టీస్ చేసిన కోహ్లీ
నెట్స్లో ఎలాంటి ఇబ్బందిలేకుండా బ్యాటింగ్ చేయడంతో పాటు స్లిప్లో క్యాచ్లు కూడా ప్రాక్టీస్ చేశాడు. బుమ్రా, అశ్విన్ కూడా ఫిట్నెస్తో ఉన్నారని జట్టు మేనేజ్మెంట్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మూడో టెస్టులో తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతున్నదని మరోసారి ఆసక్తికరంగా మారింది.