చెన్నై: టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మతో కలిసి బౌలింగ్ చేసేందుకు ఆతృతగా ఉన్నా అని హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్లో మూడు మ్యాచ్లాడిన సిరాజ్.. 13 వికెట్లు పడగొట్టి అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఒడిసిపట్టాడు. కెరీర్లో ఆడిన మూడో టెస్టులోనే అదీ గబ్బాలో ఐదు వికెట్ల మార్క్ని సిరాజ్ అందుకోవడంతో ఒక్కసారిగా హీరో అయ్యాడు. ఆసీస్ ప్రదర్శనతోనే త్వరలోనే ఇంగ్లాండ్తో చెపాక్ వేదికగా జరగనున్న తొలి రెండు టెస్టులకి భారత్ టెస్టు జట్టులోకి సిరాజ్ని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు.
తాజాగా ఓ జాతీయ మీడియాతో మొహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ... 'నేను నా దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నా. ఆస్ట్రేలియా పర్యటన తరహాలో భారత్ జట్టుని గెలిపించాలని ఆశిస్తున్నా. ఆసీస్ పర్యటనలో నాకు పెద్ద అవకాశం లభించింది. ఇంగ్లాండ్తో సిరీస్లోనూ అవకాశం వస్తే.. అదే మెరుగైన ప్రదర్శనని కొనసాగిస్తా. ఇప్పటికే మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాల నుంచి బౌలింగ్కి సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నా' అని అన్నాడు.
'జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, శార్ధూల్ ఠాకూర్తో కలిసి బౌలింగ్ చేశాను. కానీ ఇషాంత్ శర్మతో కలిసి ఇంకా బౌలింగ్ చేయలేదు. ఒకవేళ ఇషాంత్తో కలిసి బౌలింగ్ చేసే అవకాశం లభిస్తే.. నేర్చుకునే దశలో అది ఓ కీలక అడుగుకానుంది. ఆస్ట్రేలియా సిరీస్ నుంచి నేను చాలా నేర్చుకున్నా. డ్రెస్సింగ్ రూం నుంచి నెట్ సెషన్ల వరకు చేటేశ్వర్ పూజారా, అజింక్య రహానే, మొహ్మద్ షమీ, రోహిత్ శర్మ మరియు కోచ్ రవిశాస్త్రి నుంచి చాలా నేర్చుకున్నా' అని మొహ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో మహ్మద్ సిరాజ్తో పాటు జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ లాంటి సీనియర్ ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకి బీసీసీఐ సెలెక్టర్లు చోటిచ్చారు. ఇక చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి అశ్విన్, సుందర్, కుల్దీప్ ముగ్గురు బరిలోకి దిగనున్నారు. దాంతో సిరాజ్కి తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగానే ఉంది. తొలి టెస్టులో ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
కళ్లుచెదిరే క్యాచ్.. సూపర్మ్యాన్లా గాల్లోకి దూకి ఒంటిచేత్తో పట్టాడు (వీడియో)