అహ్మదాబాద్: పిచ్ను నిందించడం ఆపి బ్యాటింగ్పై దృష్టిసారించాలని క్రికెట్ దిగ్గజాలు సూచించినా.. పేస్ పిచ్లపై బ్యాట్స్మెన్ విఫలమైనప్పుడు లేవని నోళ్లు కొంచెం స్పిన్ అయితే ఏడ్చి చస్తున్నారని స్టార్ స్పిన్నర్లంతా అసహనం వ్యక్తం చేసినా.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ మాత్రం తన విమర్శలను ఆపడం లేదు. భారత్-ఇంగ్లండ్ మధ్య మొతేరా మైదానం వేదికగా జరిగిన డే/నైట్ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడంతో పిచ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
అసలు ఆ పిచ్ టెస్ట్ క్రికెట్కు పనికిరాదని ఘాటుగా విమర్శించిన వాన్.. ఇలాంటి పిచ్లను తయారు చేస్తే మూడు ఇన్నింగ్స్లు ఆడేలా నిబంధనలు తీసుకురావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతటితో ఆగకుండా ఇదే మైదానం వేదికగా గురువారం నుంచి జరగనున్న నాలుగో టెస్టుకు ఇలాంటి పిచ్నే తయారు చేస్తున్నారని, పొలం దున్నినట్లు పిచ్ను నాగలితో దున్నుతున్నారని సెటైర్లు పేల్చాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా రైతు పొలం దున్నుతున్న ఫొటోను పంచుకున్నాడు.
తాజాగా మరో అడుగు ముందుకేసిన వాన్ .. ఆ పిచ్పై తన ప్రిపరేషన్ ఎలా ఉందో చూడండి అంటూ మరో సెటైరికల్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఆ ఫొటోలో ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ దున్నిన పొలంలో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఫోజిచ్చాడు. ''నాలుగో టెస్టుకు నా ప్రిపరేషన్ సూపర్గా జరుగుతుంది'' అంటూ దానికి క్యాప్షన్ జత చేశాడు. వాన్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
'సిరీస్ను3-1తో భారత్ కైవసం చేసుకోవడం ఖాయం.. నాలుగో టెస్టు.. పింక్ బాల్ టెస్టు కన్నా దారుణంగా ఉండబోతుంది.. మీ పోస్టులు నవ్వు తెప్పిస్తున్నా.. పిచ్ కండీషన్ మాత్రం భయకరంగా ఉంది' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అహ్మదాబాద్ పిచ్పై వాన్తో పాటు యువరాజ్ సింగ్, కెవిన్ పీటర్సన్, మార్క్ వా, హర్భజన్ సింగ్ లాంటి మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు చేశారు. కాగా మూడో టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అశ్విన్, నాథన్ లయన్, ప్రజ్ఞాన్ ఓజా, వీవీ రిచర్డ్స్ విమర్శలను తప్పుబట్టారు.