చిన్న మిస్ కమ్మునికేషన్:
వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా జానీ బెయిర్స్టో మాట్లాడుతూ తను వేసుకున్న జెర్సీపై స్పందించాడు. 'తొలి వన్డేలో నేను వేసుకున్న జెర్సీ నా సహచరులు వేసుకున్న దాని కంటే కాస్త భిన్నంగా ఉంది. అయితే చిన్న మిస్ కమ్మునికేషన్ వల్ల ఈ పొరపాటు జరిగింది. టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్కు మేం వేసుకోబోయే జెర్సీలు ఇంగ్లండ్ నుంచి వచ్చాయి. అన్ని ప్యాక్ చేసి ఉండడంతో.. మ్యాచ్ సమయానికి ప్యాక్ విప్పి జెర్సీ వేసుకున్నా. కానీ పొరపాటున టీ20 జెర్సీకి ఉపయోగించిన కలర్నే నా వన్డే జెర్సీకి వాడినట్లున్నారు. నేను స్పెషల్గా ఎలాంటి జెర్సీని ధరించలేదు. అసలు విషయం ఇది' అని తెలిపాడు.
బెయిర్స్టో విధ్వంసం:
ఇక తొలి వన్డేలో భారత్ గెలిచినా.. జానీ బెయిర్స్టో విధ్వంసం ఓ దశలో కోహ్లీసేనను కంగారుపెట్టింది. కేవలం 66 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 94 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతని దాటికి ఇంగ్లండ్ ఒక దశలో వికెట్లేమి కోల్పోకుండా 135 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ అనూహ్యంగా బెయిర్స్టో అవుట్ కావడం.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు రాణించకపోవడంతో ఇంగ్లండ్ 66 పరుగులతో పరాజయం చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే పుణే వేదికగా శుక్రవారం జరగనుంది.
తప్పుపట్టడం లేదు:
తొలి వన్డేలో ఓటమికి జట్టును తప్పుపట్టడం లేదని ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్ అన్నాడు. 'మాది ప్రమాదకరమైన జట్టని నా నమ్మకం. మ్యాచులో మేం బాగా ఆడాం. అలాగే బ్యాటింగ్ కొనసాగించి ఉంటే లక్ష్యాన్ని త్వరగా ఛేదించేవాళ్లం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో భారత్ ఒకటి. చాలాసార్లు వారితో కఠిన సవాళ్లే ఎదురవుతాయి. అయితే నేను మా జట్టును తప్పుపట్టను. టీమిండియా చక్కగా బౌలింగ్ చేసింది. మేం పొరపాట్లు చేశాం. మధ్యలో భాగస్వామ్యాలు నెలకొల్పలేదు. మేం నంబర్వన్గా ఉండటమే ముఖ్యం కాదు. నాణ్యమైన జట్టును నిర్మించుకోవడం మా లక్ష్యం' అని మోర్గాన్ అన్నాడు.