కోహ్లీ విజయాన్ని అందుకుంటాడా?
ఇప్పుడు కోహ్లీ వంతు వచ్చింది. దీంతో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ విజయాన్ని అందుకుంటాడా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1932లో తొలిసారి సీకే నాయుడు కెప్టెన్సీలో భారత్ లార్డ్స్లో తొలి టెస్టు ఆడింది. ఈ టెస్టులో భారత్ 158 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత జరిగిన ఏడు టెస్టుల్లో భారత జట్టు పరాజయం పాలుకాగా, రెండింటిని డ్రాగా ముగించింది. మళ్లీ 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ లార్డ్స్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్లో కపిల్ నాయకత్వంలోని టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ధోని సారథ్యంలో రెండో సారి లార్డ్స్లో భారత్ విజయం
ఆ తర్వాత 2014లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ రెండో సారి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో విజయం సాధించింది. కుక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు 95 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియా మ్యాచ్లు నెగ్గకపోయినప్పటికీ, భారత క్రికెటర్లు మాత్రం అరుదైన రికార్డులను నెలకొల్పారు. లార్డ్స్లో భారత మాజీ క్రికెటర్ దిలిప్ వెంగ్సర్కార్ బెస్ట్ రికార్డుని కలిగి ఉన్నాడు. ఈ మైదానంలో మొత్తం నాలుగు మ్యాచ్లాడిన దిలిప్ వెంగ్ సర్కార్ 508 పరుగులు నమోదు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది.
వెంగ్ సర్కార్ పాత్ర కీలకం
1986లో వెంగ్ సర్కార్ ఈ స్టేడియంలో 126 పరుగులతో నాటౌట్గా నిలిచి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్లు ఇదే మైదానంలో అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. 1996లో టెస్టు క్రికెట్లోకి లార్డ్స్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన సౌరవ్ గంగూలీ 131 పరుగులు చేయగా, రాహుల్ ద్రవిడ్ 95 పరుగులతో మెరిశారు. మరోవైపు లార్డ్స్లో ఇంగ్లాండ్ జట్టు రికార్డు కూడా ఫరవాలేదు. 2011 నుంచి ఈ మైదానంలో ఇంగ్లాండ్ 21 టెస్టు మ్యాచ్లాడగా అందులో 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది.
రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం
అదే గత ఐదు మ్యాచ్లను పరిశీలిస్తే ఇంగ్లాండ్ కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. చివరగా ఈ స్టేడియంలో గత మే నెలలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక, వ్యక్తిగతంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు కొందరు ఈ మైదానంలో అద్భుతమైన రికార్డులను కలిగి ఉన్నారు. లార్డ్స్లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ 1916 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఇక, ఇంగ్లాండ్ ప్రస్తుత కెప్టెన్ జో రూట్ కూడా ఈ మైదానంలో మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు.
ఈ టెస్టులో కోహ్లీ సేన విజయం సాధిస్తుందో లేదో
ఇప్పటివరకు లార్డ్స్లో జో రూట్ మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక, ఇంగ్లాండ్ పేసర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు సైతం లార్డ్స్లో మెరుగైన రికార్డుని కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ చాన్నాళ్లకు కోహ్లీ నాయకత్వంలో భారత్ లార్డ్స్ మైదానంలో టెస్టు ఆడబోతోంది. గురువారం నుంచి ప్రారంభంకానున్న ఈ టెస్టులో కోహ్లీ సేన విజయం సాధిస్తుందో లేదో చూడాలి. కెప్టెన్గా కోహ్లీ ఈ మైదానంలో విజయం సాధించి కపిల్దేవ్, ధోనీ సరసన నిలుస్తాడో లేదో చూడాలి.