Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వికెట్‌ను పక్కన పెట్టి.. బ్యాట్స్‌మెన్‌ను నిందిస్తారా? కోహ్లీ వ్యాఖ్యలు కోపం తెప్పించాయి: కుక్

India vs England: Alastair Cook questioned Virat Kohlis judgement about the Motera pitch

లండన్‌: అహ్మదాబాద్‌లోని మొతేరా పిచ్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ వైఖరిని ఇంగ్లండ్ మాజీ సారథి అలిస్టర్‌ కుక్‌ ప్రశ్నించాడు. వికెట్‌ బ్యాటింగ్‌కు అనువుగానే ఉందన్న కోహ్లీ వ్యాఖ్యలతో అతడు విభేదించాడు. అలాంటి పిచ్‌పై ఆడటమే ఎంతో కష్టమన్నాడు. పింక్‌ బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో కోహ్లీసేన ఆధిక్యంలో నిలిచింది. టీమిండియాలో విజయం వెనుక పిచ్‌ కీలకపాత్ర పోషించిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.

అయితే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. పిచ్‌లో ఏం తప్పు లేదని, బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం వల్లే మ్యాచ్‌ రెండు రోజుల్లో ముగిసిందన్నాడు. ఈ వ్యాఖ్యలపై అలిస్టర్‌ కుక్‌ స్పందించాడు. 'విరాట్‌ కోహ్లీ మొతేరా పిచ్‌కు మద్దతుగా మాట్లాడాడు. అది పిచ్‌గా ఏమాత్రం లేదు. ఆ పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. వికెట్‌ను పక్కన పెట్టి.. బ్యాట్స్‌మెన్‌ను నిందిస్తారా?. పిచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలించిందన్న కోహ్లీ అంచనా తప్పు. అతడి వ్యాఖ్యలు నాకు కోపం తెప్పించాయి' అని కుక్ పేర్కొన్నాడు.

'విరాట్‌ కోహ్లీ, జో రూట్‌ మ్యాచ్‌లో ఆడారు. స్పిన్‌ను ఎదుర్కోగల గొప్ప ఆటగాళ్లూ ఉన్నారు. స్పిన్‌ను మెరుగ్గా ఆడటం, నేర్చుకొనే క్రికెటర్లూ ఉన్నారు. కానీ దిగ్గజ ఆటగాళ్లూ స్పిన్‌ ఆడేందుకు ఇబ్బంది పడ్డారు కదా?. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ ఢిఫెన్స్‌ మోడ్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. బంతి స్కిడింగ్‌ అవుతున్నప్పుడు ఎరుపు బంతితో ఏమైనా తేడా ఉంటుందేమో చూడాలి. ఏదేమైనా భారత్‌లోని అన్నింటికన్నా ఈ పిచ్‌పై బంతి ఎక్కువగా టర్న్‌ అయిందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. చాలా బంతులు నేరుగా వచ్చాయి. అంటే టర్న్‌ అయిన బంతులు విపరీతంగానే అయ్యాయి' అని కుక్‌ అన్నాడు.

'పిచ్‌లో ఏం తప్పు లేదు.. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం వల్లే మ్యాచ్‌ రెండు రోజుల్లో ముగిసింది. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటింగ్‌ నాణ్యతలో లోపం ఉంది. మొదటి రోజు 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసి ఆటను ముగించాం. కానీ రెండో రోజు దానికి మరో 46 పరుగులు మాత్రమే జత చేశాం. ఇదే ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లోనూ నిజమైంది. తొలి ఇన్నింగ్స్‌ సమయంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి కోల్పోయిన 30 వికెట్లలో 21 వికెట్లు నేరుగా విసిరిన బంతులకే పడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మన డిఫెన్స్‌పై నమ్మకం పెట్టుకోకకుండా పిచ్‌ను నిందించడం సరికాదు. టెస్టు క్రికెట్‌లో నెమ్మైదన ఆట ఆడడం ప్రధానం. పరుగులు చేయలేకపోవడం వల్లే మ్యాచ్‌ రెండు రోజుల్లో ముగిసింది' అని కోహ్లీ మ్యాచ్ అనంతరం అన్నాడు.

మొతేరా పిచ్‌పై ఇంగ్లండ్‌కు మద్దతుగా కొందరు మాజీ క్రికెటర్లు మాట్లాడుతున్నారు. పిచ్‌ టెస్టులకు పనికిరాదని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇంగ్లండ్‌లో సీమింగ్‌ పిచ్‌లపై పేసర్లు వికెట్లు తీసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని భారత మాజీలు కొందరు ప్రశ్నిస్తున్నారు. నాలుగో టెస్ట్ వ‌చ్చే గురువారం (మార్చి 4) నుంచి అహ్మదాబాద్‌లోనే జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ సమయంలో పిచ్ ఎలా ఉంటుందో చూడాలి.

Story first published: Saturday, February 27, 2021, 16:20 [IST]
Other articles published on Feb 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+