రాహుల్ స్థానంలో ఇషాన్:
అన్ని విభాగాల్లో ఉత్తమంగా కనిపిస్తున్న ఇంగ్లండ్ను ఓడించాలంటే.. భారత జట్టు ఎంతో మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. ముఖ్యంగా కాగితం మీద ఎంతో బలంగా కనిపిస్తున్న భారత బ్యాటింగ్ విభాగం.. మైదానంలో నిలకడ అందుకోకుంటే కష్టం. చివరి మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఒక మార్పు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సిరీస్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో 1,0, 0, 14 పరుగులతో నిరాశపరిచిన ఓపెనర్ కేఎల్ రాహుల్పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్ స్థానంలో యువ హిట్టర్ ఇషాన్ కిషన్ ఓపెనర్గా ఆడే అవకాశం ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల మాట్లాడుతూ రాహుల్పై నమ్మకం ఉందని, టీ20ల్లో అతడే సరైన ఓపెనర్ అని అన్నాడు. మరి ఎవరిని తీసుకుంటాడో చూడాలి.
రోహిత్, కోహ్లీ ఆడాల్సిందే:
ప్రపంచంలోనే మేటి ఓపెనర్గా పేరున్న రోహిత్ శర్మ నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన టీం మేనేజ్మెంట్ ఆశిస్తోంది. 2, 3 టీ20ల్లో చెలరేగిన విరాట్ కోహ్లీ.. గత మ్యాచ్లో విఫలమయ్యాడు. కీలక పోరులో కెప్టెన్ నుంచి అభిమానులు పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే.. ఎంత స్కోరు చేసినా కాపాడుకోవడం కష్టం కాబట్టి సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాల్సిందే. మొదట బ్యాటింగ్ చేస్తే ఇంగ్లండ్ పేసర్లను కాచుకోవడం భారత బ్యాట్స్మెన్కు సవాలుగా మారుతోంది. టాస్ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తున్నప్పటికీ.. 200 స్కోరు చేసి ఇంగ్లండ్కు సవాలు విసరాల్సిన బాధ్యత బ్యాట్స్మెన్దే.
భువీ మెరుపులు లేవు:
భారత జట్టులో నిలకడగా రాణిస్తున్న బౌలర్లు కనిపించడం లేదు. ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ అంచనాలకు తగ్గట్లు రాణించట్లేదు. శార్దూల్ ఠాకూర్ చివర్లో రెండు వికెట్లు తీసి భారత్ను కాపాడాడు కానీ భారీగా పరుగులిచ్చేశాడు. ముందు మ్యాచ్లో రాణించిన స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్.. నాలుగో టీ20లో తేలిపోయాడు. టీ నటరాజన్ అతని స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఇక యుజ్వేంద్ర చహల్ జట్టుకు ఉపయోగపడకపోవడంతో వేటు తప్పలేదు. అతడి స్థానంలో వచ్చిన రాహుల్ చహర్ గత మ్యాచ్లో రాణించాడు. అయితే చివరి టీ20లో ఏం చేస్తాడో చూడాలి. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో లయ అందుకుంటుండటం సానుకూలాంశం.
ఏ ఇద్దరు క్రీజులో కుదురుకున్నా:
ఇంగ్లండ్ గత మ్యాచ్ ఓడినా దాదాపు గెలుపునకు చేరువగా వచ్చింది. బెన్ స్టోక్స్ ఫామ్లోకి రావడం ఇంగ్లండ్ను మరింత పటిష్టంగా మార్చింది. బట్లర్, రాయ్, మలన్, బెయిర్స్టో, మోర్గాన్.. వీరిలో ఏ ఇద్దరు క్రీజులో కుదురుకున్నా మ్యాచ్పై ఆశలు వదులుకోవాల్సిందే. భీకర బ్యాటింగ్ ఆర్డర్కు భారత బౌలర్లు ఏమేర అడ్డుకట్ట వేస్తారో చూడాలి. ఇక బౌలింగ్లో మరోసారి వుడ్, ఆర్చర్ల పేస్పై ఇంగ్లండ్ జట్టు ఆశలు పెట్టుకుంది. చివరి వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండటం ఇంగ్లండ్కు మరో బలం.
టాస్ కీలక పాత్ర:
ఈ సిరీస్లో టాస్ ఎంత కీలక పాత్ర పోషిస్తోందో తెలిసిందే. అది గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా ఛేదనను ఎంచుకుంటోంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు తడబడుతోంది. తొలి మూడు మ్యాచ్ల్లో టాస్ గెలిచిన జట్టే మ్యాచ్ గెలిచింది. అయితే గత మ్యాచ్లోనూ టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. మొదట తడబడ్డప్పటికీ, పుంజుకుని భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ లక్ష్యానికి చేరువగా వచ్చి, త్రుటిలో ఓడింది. శనివారం కూడా టాస్ గెలిచిన జట్టు.. బౌలింగ్ ఎంచుకుని, మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఓటమి ఎరుగకుండా:
టీమిండియా గత ఏడు టీ20 సిరీస్ల్లో ఓటమి ఎరుగకుండా ముందుకు సాగుతున్నది. 2019 తర్వాత భారత్ ఆరు సిరీస్లు నెగ్గి ఒకదాన్ని 'డ్రా' చేసుకుంది. గత ఎనిమిది టీ20 సిరీస్ల్లో ఇంగ్లండ్కు పరాజయం ఎదురు కాలేదు. 2018 నుంచి ఏడు సిరీస్లు చేజిక్కించుకున్న మోర్గాన్ సేన ఒకదాన్ని 'డ్రా'గా ముగించింది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 18 మ్యాచ్ల్లో చెరో తొమ్మిది గెలిచాయి.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్/టీ నటరాజన్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చహర్.
ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోన్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
టీమిండియా రిజర్వ్ బెంచ్ బలం పెరగడానికి ప్రధాన కారణం అదే: సచిన్