
లండన్: సౌథాంప్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య ఇంగ్లాండ్ వరుసగా వికెట్లను చేజార్చుకుంటుంది.
భారత బౌలర్ల పదునైన బంతులకు ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఒక్క పరుగుకే ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు 36 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.
వరుసగా వికెట్లు పడుతున్నా... మరో ఓపెనర్ అలెస్టర్ కుక్ మాత్రం నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పెంచుతున్నాడు. ఈ క్రమంలో ఓపెనర్ అలెస్టర్ కుక్ను హార్దిక్ పాండ్యా అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. పాండ్యా వేసిన 18వ ఓవర్ తొలి బంతిని ఆడిన కుక్(17) పరుగుల వద్ద కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

స్లిప్లో ఉన్న విరాట్ కోహ్లీ కుక్ ఆడిన బంతిని లో క్యాచ్గా అందుకోవడం విశేషం. ఈ సిరిస్లో కుక్ని పాండ్యా తొలిసారి పెవిలియన్కు చేర్చాడు. కాగా, వరుసగా 8 ఇన్నింగ్స్ల్లో కుక్ హాఫ్ సెంచరీ పూర్తి చేయకుండా ఔటయ్యాడు. ఇండియాపై అయితే వరుసగా 12 ఇన్నింగ్స్ల్లో కుక్ హాఫ్ సెంచరీ నమోదు చేయలేకపోయాడు.
ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసి పీకలోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం బెన్ స్టోక్స్(10), కీపర్ జోస్ బట్లర్(11) పరుగులతో క్రీజులో ఉన్నారు.