
లండన్: నాటింగ్హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. తమ పదునైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను బెంబేలెత్తిస్తున్నారు. భారత పేసర్ల దెబ్బకు ఇంగ్లాండ్ టాపార్డర్ కుప్పకూలింది.
ఇషాంత్(2 వికెట్లు)కు తోడుగా షమి, బుమ్రా తలో వికెట్ తీయడంతో లంచ్ విరామ సమయానికి 35 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 84/4 స్కోరుతో ఉంది. ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్ (19), బెన్ స్టోక్స్ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవర్ నైట్ స్కోరు 23/0తో మంగళవారం ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లాండ్కు ఆట ఆరంభంలోనే ఇషాంత్ శర్మ షాకిచ్చాడు.
ఓపెనర్లు అలిస్టర్ కుక్(17), కీటన్ జెన్సింగ్స్(13) ఇద్దరిని ఐదు పరుగుల తేడాతో పెవిలియన్కు చేర్చాడు. ఇషాంత్ శర్మ వేసిన ఐదో బంతికి ఇంగ్లాండ్ ఓపెనర్ జెన్నింగ్స్ (13) ఔటయ్యాడు. జెన్నింగ్స్ బ్యాట్ అంచుకు తాకిన బంతిని రిషబ్ పంత్ అందుకున్నాడు. దీంతో అరంగేట్రం మ్యాచ్లో ఆరుగురిని పెవిలియన్ పంపించడంలో భాగస్వామ్యం ఉన్న తొలి వికెట్ కీపర్గా రికార్డు సృష్టించాడు.
ఈ క్రమలో రిషబ్ పంత్... నరేన్ తమ్హానె, కిరణ్ మోరె, నయన్ మోంగియా, నమన్ ఓజా రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత ఇషాంత్ శర్మనే ఇన్నింగ్స్ 12వ ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్ అలెస్టర్ కుక్ (17)ను పెవిలియన్కు చేర్చాడు. స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్ ఈ క్యాచ్ని అందుకున్నాడు. కుక్ను ఇషాంత్ శర్మ ఔట్ చేయడం ఇది 11వ సారి.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జోరూట్, పోప్తో కలిసి స్కోరు బోర్డుని పెంచే ప్రయత్నం చేశాడు. అయితే బుమ్రా వేసిన 25వ ఓవర్ మూడో బంతికి రూట్(13) రాహుల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో కేఎల్ రాహుల్ కుడికంటికి చేతిని అడ్డుపెట్టుకొని 'డెల్లీ అలీ' వేడుకలు చేసుకున్నాడు.
ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే ఒలివ్ పోప్ (16)ను షమి ఔట్ చేశాడు. స్లిప్లో కేఎల్ రాహుల్ దగ్గరకు వచ్చిన బంతిని పక్కనే ఉన్న కోహ్లీ ఎగిరి మరీ అందుకోవడం విశేషం. ఆ తరవాత బుమ్రా వేసిన ఓవర్లో బట్లర్ ఇచ్చిన క్యాచ్ను కీపర్ పంత్ జారవిడిచాడు. పంత్ ఆ క్యాచ్ పట్టుంటే ఇంగ్లాండ్ మరింత ఒత్తిడిలోకి వెళ్లిపోయుండేది. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే ఇంగ్లండ్ ఇంకా 437 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్కు మరో ఆరు వికెట్లు కావాలి.
ఇదిలా ఉంటే, భారత్ తన రెండో ఇన్నింగ్స్లో 352 పరుగులకు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఇంగ్లండ్ ముందు 521 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.