ఇండోర్: రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ హోల్కర్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్టుకు వ్యాఖ్యాతలుగా భారత మాజీ ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ ఉన్నారు. వీరితో పాటు భారతీయ టీవీ స్పోర్ట్స్ జర్నలిస్ట్, టెలివిజన్ హోస్ట్ మరియు క్రికెట్ వ్యాఖ్యాత అతిన్ సప్రూ కూడా వ్యాఖ్యానం చేస్తున్నాడు.
4వేల పరుగులు పూర్తిచేసుకున్న రహానే.. దిగ్గజాల సరసన చోటు!!
ఇండోర్ స్టేడియంలో గురువారం తొలి టెస్టు ప్రారంభం అయింది. రెండో రోజు మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు లక్ష్మణ్, గంభీర్, సప్రూ అల్పాహారం కోసం బయటికి వెళ్లారు. అక్కడి స్థానిక వంటకాలను ముగ్గురు ఆనందించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రసిద్ధ అల్పాహారం వంటకాలు పోహా, జలేబీని తిని ఆస్వాదించారు. దీనికి సంబందించిన పోటోలను లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
Kabhi pohe se teekhe, kabhi jalebi se meethe ... wonderful start to the day in Indoor, where we had breakfast outdoor 😛 pic.twitter.com/DxIPtNqYi7
— VVS Laxman (@VVSLaxman281) November 15, 2019
'కొన్నిసార్లు పోహే వేడిగా ఉంటుంది. మరి కొన్నిసార్లు జలేబీ తియ్యగా ఉంటుంది. ఇండోర్లో అద్భుతమైన ప్రారంభం. మేము అల్పాహారం కోసం బయట ఉన్నాం' అని లక్ష్మణ్ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
తొలి ఇన్నింగ్స్లో భారత పేస్ త్రయం ధాటికి బంగ్లాదేశ్ తొలి రోజే చాప చుట్టేసింది. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ఆరంభంలోనే ప్రత్యర్థి పతనానికి బాటలు వేయగా.. ఆ తర్వాత రివర్స్ స్వింగ్తో పేసర్ మహ్మద్ షమీ బెంబేలెత్తించాడు. షమీ (3/27), ఇషాంత్ (2/20), ఉమేశ్ (2/47) నిప్పులు చెరగడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(6) విఫలం కాగా.. మయాంక్ అగర్వాల్ జట్టును ఆదుకున్నాడు. పుజారా అండతో అతడు ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. అర్ధ సెంచరీ అనంతరం పుజారా.. ఆ వెంబడే కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) ఔట్ అయినా.. మయాంక్ సెంచరీతో మెరిశాడు. ఆపై రహానే కూడా అర్థ శతకం సాధించడంతో భారత్ ఆధిక్యంలో నిలిచింది. భారత తమ తొలి ఇన్నింగ్స్లో 93 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ (178), జడేజా (8) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 187 పరుగుల ఆధిక్యంలో ఉంది.