నూతన పద్ధతులను ప్రవేశపెట్టాలి:
డే/నైట్ టెస్టు మ్యాచ్కు సంబంధించిన మస్కట్స్ను సౌరవ్ గంగూలీ ఆదివారం మైదానంలో ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ... 'టెస్టు క్రికెట్లో కొత్త పద్ధతులను తీసుకురావాలి. కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఇది జరుగుతుంది. ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాల్సిందే. క్రికెట్ పరంగా భారత్ చాలా పెద్ద దేశం. నూతన పద్ధతులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది' అని గంగూలీ అన్నాడు.
అభిమానులను తీసుకురావడం తేలిక కాదు:
'భారత్-పాకిస్థాన్ల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచంలో ఎక్కడైనా అభిమానులు వస్తారు. ఆ మ్యాచ్ గురించి ప్రకటిస్తే చాలు.. స్టేడియం నిండిపోతుంది. అయితే అసలైన పరీక్ష ఇప్పుడుంది. టెస్టు క్రికెట్కు అభిమానులను తీసుకురావడం అంత సులువైన విషయం కాదు. అయినా.. తొలి మూడు రోజుల్లో ఒక్కో రోజు 65 వేల మంది చొప్పున అభిమానులు డే/నైట్ టెస్టు మ్యాచ్కు వస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది' అని దాదా చెప్పాడు.
కోహ్లీ ఆశ్చర్యపోతాడు:
'టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. విరాట్ తొలి రోజు మైదానంలోకి వచ్చినప్పుడు స్టేడియం మొత్తం అభిమానులతో నిండి ఉండటం చూసి సంతోషిస్తాడు. అదే సమయంలో ఆశ్చర్యపోతాడు కూడా. తొలి మూడు రోజులు అభిమానులతో ఈడెన్గార్డెన్స్ కిక్కిరిసిపోతుంది. ఇక్కడి ఏర్పాట్లు అందరిని మైమరిపిస్తాయి. కోల్కతా మొత్తం గులాబీమయం చేస్తాం' అని గంగూలీ తెలిపాడు.
గంట కొట్టనున్న హసీనా:
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఉదయం గంట కొట్టి డే/నైట్ టెస్టు మ్యాచ్ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత విరామంలో ఫాబ్యూలస్ ఫైవ్ పేరుతో జరిగే టాక్షోలో దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ టెస్టు అనుభవాలను పంచుకోనున్నారు.