నిలకడగా రాణిస్తున్నాడు:
రెండో టీ20లో చహల్ తన కోటా 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో రోహిత్ అతనిని ప్రశంసించాడు. తాజాగా రోహిత్ మీడియాతో మాట్లాడుతూ... 'జట్టులో చాలా మంది కుర్రాళ్లున్నారు. అప్పుడిప్పుడే జట్టులోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. చహల్ ఐపీఎల్లో అద్భుత ఆటతో జాతీయ జట్టులోకి వచ్చాడు. అప్పట్నుంచి టీమిండియాలో కీలక ఆటగాడిగా మారిపోయాడు. రెండేళ్లుగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. వన్డే, టీ20ల్లోను అద్భుతాలు చేశాడు' అని అన్నాడు.
బ్యాట్స్మన్ కన్నా తెలివైనవాడు:
'చాహల్కు తానేం చేయాలో తెలుసు. అలాగే బ్యాట్స్మెన్ ఏం చేస్తాడో తెలుసు. అతడు బ్యాట్స్మన్ కన్నా తెలివైనవాడు. ఎంతో ముందుచూపుతో ఉంటాడు. మధ్య ఓవర్లలో చాహల్ అద్భుతంగా బంతులు వేస్తాడు. డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేసేందుకు భయపడడు. చాహల్ను 18వ ఓవర్లోనూ వాడుకున్నా. రెండో టీ20లో చహల్ బౌలింగ్ సూపర్' అని రోహిత్ ప్రశంసించాడు.
మా బౌలర్లకు అనుభవం తక్కువే:
టీమిండియాలో అనుభవం లేని బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటాం అని బంగ్లాదేశ్ కోచ్ రసెల్ డొమింగో అన్నాడు. దీనిపై స్పందిస్తూ... 'ప్రస్తుత జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. వారిపై నమ్మకం ఉంది. మా బౌలర్లకు అనుభవం తక్కువున్నా.. మరో అవకాశం ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. వారు నేర్చుకునేందుకు ఇదే సరైన సమయం. దేశవాళీ క్రికెట్లో ఆడి, అక్కడే నేర్చుకోవాలని మనం చెబుతుంటాం. కానీ.. అంతర్జాతీయ క్రికెట్లో ఆడేంతవరకు ఒక బౌలర్గా ఏ స్థాయిలో ఉంటారో తెలియదని నేను భావిస్తున్నా' అని రోహిత్ పేర్కొన్నాడు.
సెంచరీ చేజారినందుకు బాధలేదు"
'నా వందో టీ20లో సెంచరీ చేజారినందుకు బాధలేదు. జట్టు గెలుపు కోసమే ఆ ఇన్నింగ్స్ ఆడాను. అందుకు సంతోషంగా ఉంది. నాగ్పూర్ పిచ్ క్రికెట్ ఆడటానికి మంచి ట్రాక్. సరైన దిశలో బౌలింగ్ చేస్తే ఈ పిచ్ బౌలర్లకు కూడా సహకరిస్తుంది. మేం సిరీస్ గెలుస్తాం' అని రోహిత్ ధీమా వ్యక్తం చేసాడు.