మా బౌలర్లకు అనుభవం తక్కువ:
ఫైనల్ మ్యాచ్కు ముందు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ మీడియాతో మాట్లాడుతూ... 'ప్రస్తుత జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. వారిపై నమ్మకం ఉంది. మా బౌలర్లకు అనుభవం తక్కువున్నా.. మరో అవకాశం ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. వారు నేర్చుకునేందుకు ఇదే సరైన సమయం. దేశవాళీ క్రికెట్లో ఆడి, అక్కడే నేర్చుకోవాలని మనం చెబుతుంటాం. కానీ.. అంతర్జాతీయ క్రికెట్లో ఆడేంతవరకు ఒక బౌలర్గా ఏ స్థాయిలో ఉంటారో తెలియదని నేను భావిస్తున్నా. ఈ మ్యాచ్ మా బౌలింగ్ విభాగానికి ఓ సవాల్' అని రోహిత్ పేర్కొన్నాడు.
నాగ్పూర్ పిచ్ మంచి ట్రాక్:
'నాగ్పూర్ పిచ్ క్రికెట్ ఆడటానికి మంచి ట్రాక్. సరైన దిశలో బౌలింగ్ చేస్తే ఈ పిచ్ బౌలర్లకు కూడా సహకరిస్తుంది. రాజ్కోట్ పిచ్ సైతం బౌలర్లకు అనుకూలించింది, ముఖ్యంగా భారత స్పిన్నర్లకు. బంతి నుంచి మంచి టర్నింగ్ లభించింది. బౌలర్ల వద్ద నైపుణ్యం, వైవిధ్యం ఉంటే పిచ్ ఎలాంటిదైనా.. దాని గురించి ఆలోచించాల్సిన పనిలేదు' అని రోహిత్ అన్నాడు.
పంత్కు రోహిత్ మద్దతు:
వరుస వైఫల్యాలతో విమర్శల పాలువుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్కు రోహిత్ మద్దతుగా నిలిచాడు. 'జట్టు వ్యూహాలను పంత్ బాగానే అమలు చేస్తున్నాడు. దయచేసి అతడిని విడిచిపెట్టండి. ప్రతిరోజు, ప్రతి నిమిషం పంత్ గురించి చర్చ జరుగుతోంది. ఆటలో అతడికి స్వేచ్ఛనివ్వాలని మేం అనుకుంటున్నాం. పంత్పై కాస్త దృష్టి పెట్టడం తగ్గిస్తే.. అతడు మరింత మెరుగ్గా ఆడగలడు' అని హిట్మ్యాన్ చెప్పాడు.
ఖలీల్ మరో అవకాశం:
ఈ సిరీస్లో టీమిండియా వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యా, యుజువేంద్ర చహల్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్లను ఆడించింది. రెండు టీ20ల్లో విఫలమైన ఖలీల్కు బదులు చివరి మ్యాచ్లో శార్దుల్ ఠాకుర్కు అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. అయితే రోహిత్ మాటలను బట్టి చూస్తే.. మూడో టీ20లో కూడా ఖలీల్ ఆడే అవకాశాలు ఉన్నాయి.