|
మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ
తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 493/6 పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజైన శనివారం టీమిండియా అదే పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 343 పరుగుల ఆధిక్యం లభించింది.
తొలి ఇన్నింగ్స్ను 493/6 వద్ద డిక్లేర్ చేసిన భారత్
శనివారం ఉదయం మరికొన్ని పరుగులు చేసి బంగ్లాని బ్యాటింగ్కి ఆహ్వానిస్తుందని అంతా భావించారు. అయితే, అందుకు భిన్నంగా బ్యాటింగ్కు రాకుండానే టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 493/6 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. దీంతో రెండో ఇన్నింగ్స్లో భారత పేసర్లు చెలరేగడంతో బంగ్లా ఆలౌటైంది.
|
18 పరుగులకే రెండు వికెట్లు
మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగ్లాదేశ్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఆరో ఓవర్లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఇమ్రుల్ కెయెస్(6) బౌల్డయ్యాడు. ఆ తర్వాత ఇషాంత్ బౌలింగ్లో మరో ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్(6)ని బౌల్డ్ కావడంతో బంగ్లాదేశ్ 18 పరుగులకి రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మహ్మద్ షమీ బౌలింగ్లో మొమినుల్ హక్(7), మిథున్(18)లు పెవిలియన్కు చేరారు.
|
ముష్ఫికర్ ఒంటరి పోరాటం
ఈ దశలో క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ ఎంతో బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకుపోతున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న నిలకడగా ఆడుతూ ముప్పికర్ హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో ముప్పికర్కు ఇది 20వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
భారత్పై అత్యధిక పరుగుల రికార్డు
ఈ క్రమంలో టెస్టుల్లో భారత్పై బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మహ్మద్ అష్రాఫుల్ పేరిట ఉన్న రికార్డును ముష్పికర్ బద్దలు కొట్టాడు. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అయితే 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అశ్విన్ బౌలింగ్లో పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
|
కోహ్లీ నాయకత్వంలో భారత్కు 10వ ఇన్నింగ్స్ విజయం
ముష్ఫికర్ ఔటైన తర్వాత మిగతా బ్యాట్స్మెన్లు పెవిలిన్కు క్యూ కట్టారు. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 213 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకిది 10వ ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. అన్ని రంగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా బంగ్లాను చిత్తుగా ఓడించింది.
స్కోరు వివరాలు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 493/6 డిక్లేర్డ్
బంగ్లా తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్
బంగ్లా రెండో ఇన్నింగ్స్: 213 ఆలౌట్