
హైదరాబాద్: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఇమ్రుల్(4) ఇషాంత్ శర్మ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. దీంతో పింక్ బాల్ టెస్ట్లో తొలి వికెట్ తీసిన బౌలర్గా ఇషాంత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
ప్రస్తుతం పది ఓవర్లకు గాను బంగ్లాదేశ్ ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో ఇస్లామ్(12), కెప్టెన్ మొమినుల్ హాక్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. పింక్ బాల్ టెస్టులో ఇషాంత్ శర్మకు తొలి వికెట్ లభించడంలో సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు.
తొలి బంతిని టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ సంధించగా ఓపెనర్ షాద్మాన్ ఎదుర్కొన్నాడు. దీంతో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో పింక్ బాల్ సంధించిన తొలి బౌలర్గా ఇషాంత్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. కాగా, పరుగులేమి రాకుండానే మొదటి ఓవర్ ముగిసింది. రెండో ఓవర్ ఉమేశ్ యాదవ్ వేశాడు.
రెండో ఓవర్ రెండో బంతికి ఇమ్రూల్ సింగిల్ తీయడంతో పింక్ బాల్ టెస్టులో బంగ్లాదేశ్ పరుగుల ఖాతా తెరిచింది. అంతకముందు పశ్చిమ్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు సంయుక్తంగా గంట మోగించి మ్యాచ్ని అధికారికంగా ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.
పింక్బాల్ టెస్ట్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు, ప్రముఖులతో ఈడెన్ గార్డెన్స్లో సందడి వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో #PinkBallTest హాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది.