పింక్ బాల్ టెస్ట్లో వారే కీలకం: విండిస్ దిగ్గజాలతో భారత పేసర్లకు పోలిక

హైదరాబాద్: భారత పేసర్లపై బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అమినుల్ ఇస్లామ్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత పేసర్లను చూస్తుంటే 1970-90లలో విండిస్ పేసర్లను చూసినట్లు ఉందని తెలిపాడు. ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో భారత పేసర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు తమ పదునైన బౌలింగ్తో బంగ్లా బ్యాట్స్ మెన్ను బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య నవంబర్ 22 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ప్రతిష్టాత్మక డే/నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అమినుల్ ఇస్లామ్ మాట్లాడాడు.

పింక్ బాల్తో చెలరేగుతారు
"షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరు పింక్ బాల్తో చెలరేగుతారు. సాయంత్రం, రాత్రి వేళల్లో వారు పింక్ బాల్తో బౌలింగ్ చేస్తే బ్యాట్స్మెన్కు ఇబ్బందులు తప్పవు. గతంలో భారత బౌలింగ్ దళం అంటే కుంబ్లే నేతృత్వంలోని స్పిన్నర్లు గుర్తొచ్చేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి" అని అన్నాడు.

అత్యుత్తమ పేసర్లను టీమిండియా కలిగి ఉంది
"అత్యుత్తమ పేసర్లను టీమిండియా కలిగి ఉంది. ప్రస్తుత భారత జట్టు అప్పటి విండిస్ బౌలింగ్ను తలపిస్తోంది. క్రికెట్లో అత్యుత్తమ జట్టు అంటే ఆస్ట్రేలియానే అంటుంటారు. కానీ, భారత్ గత కొంత కాలంగా నిలకడగా ఆడుతూ అద్భుత విజయాలు సాధిస్తోంది. మోడ్రన్ డే క్రికెట్లో భారత్ రోల్మోడల్" అని ప్రశంసల వర్షం కురిపించాడు.

డే/నైట్ టెస్టుకు తొలి రోజు
"డే/నైట్ టెస్టుకు తొలి రోజు దాదాపు 70వేల మంది అభిమానులు హాజరు కానున్నారు. ఇది ఎంతో సంతోషకరం. టెస్ట్ క్రికెట్ను ఇది ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. డే/నైట్ టెస్టు విజయవంతమవ్వాలని కోరకుంటున్నా. చరిత్రాత్మక ఈ టెస్టుకు దాదా ఆహ్వానం పంపించాడు. షెడ్యూల్ను బట్టి నేను హాజరవుతా. రెండో టెస్టులో బంగ్లా గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నా" అని అమినుల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications