మ్యాచ్ సమయాల్లో మార్పులు:
ఈ నెల 22-26 మధ్య కోల్కతాలో తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. భారత్-బంగ్లాల మధ్య జరిగే పింక్ బాల్ టెస్ట్ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలై రాత్రి 8 గంటలకు ముగియనుంది. మ్యాచ్ సాగే రోజుల్లో మంచు అధికంగా పడే అవకాశాలు ఉండటంతో.. మ్యాచ్ సమయాన్ని ముందుకు జరిపారు. మంచు ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని టెస్ట్ వేళల్లో స్వల్ప మార్పు చేయాలంటూ బెంగాల్ క్రికెట్ సంఘం చేసిన విజ్ఞప్తికి బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసింది.
రాత్రి 8 గంటల వరకే మ్యాచ్:
రాత్రి 8 గంటల తర్వాత మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో మ్యాచ్ను ముందుగానే నిర్వహిస్తున్నట్టు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. తొలి సెషన్ మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3.40 గం నుంచి 5.40 గం వరకు.. మూడో సెషన్ సాయంత్రం 6 గం నుంచి 8 వరకు జరుగుతుందని ఆ అధికారి చెప్పారు.
పిచ్ను ప్రత్యేకంగా తయారు చేయడం లేదు:
'డే/నైట్ మ్యాచ్ కోసం పిచ్ను ప్రత్యేకంగా తయారు చేయడం లేదు. పగటి మ్యాచ్లకు ఎలాంటి పిచ్లు తయారు చేస్తామో అలాగే చేస్తున్నాం. రాత్రి 8 దాటితే మంచు ప్రభావం అధికంగా ఉంటుందని గత మ్యాచ్లలో చూసాం. దీంతో మ్యాచ్ సమయాల్లో మార్పులు చేస్తే ఆ సమస్యను అధిగమించవచ్చు' అని ఈడెన్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తెలిపాడు.
తొలి టెస్ట్కు స్పోర్టింగ్ వికెట్:
తొలి టెస్ట్కు స్పోర్టింగ్ వికెట్ను సిద్ధం చేసినట్టు ఇండోర్ క్యూరేటర్ సమందర్ సింగ్ చౌహాన్ చెప్పాడు. 'టెస్ట్లకు ఆతిథ్య జట్టుకు అనుకూలంగా పిచ్లను తయారు చేయడం సహజం. ఇక్కడి వికెట్ మాత్రం అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఐదు రోజుల పాటు పిచ్ ఒకే తరహాలో ఉండనుంది. గత కొన్ని రోజులుగా ఆకాశం మేఘావృతం కావడంతో పిచ్ను ఎక్కువగా కవర్లతో కప్పి ఉంచాం. వికెట్ను తక్కువగా తడిపాం' అని చౌహాన్ తెలిపాడు.