భారత్లో తొలి డే/నైట్ టెస్ట్: 72 పింక్ బంతులకు ఆర్డర్ ఇచ్చిన బీసీసీఐ

హైదరాబాద్: నవంబర్ 22 నుండి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ కోసం వచ్చే వారం నాటికి 72 పింక్ బంతులను పంపిణీ చేయాలని తయారీదారు ఎస్జీని బీసీసీఐ కోరింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే డే/నైట్ టెస్టుని ఎస్జీ బంతులతో నిర్వహిస్తామని గంగూలీ చెప్పిన సంగతి తెలిసిందే.
భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ 3 టీ20లు, 2 టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ తొలి టెస్టులో ఎస్జీ బంతితోనే ఆడతారు.. కాబట్టి రెండో టెస్టులోనూ అదే సంస్థ బంతిని ఉపయోగిస్తామని అన్నాడు. డ్యూక్స్ లేదా కూకబుర్రా బంతితో మ్యాచ్ సాధ్యం కాదని స్పష్టం చేశాడు.

ఆనంద్ పీటీఐతో మాట్లాడుతూ
తాజాగా ఎస్జీ కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ పరాస్ ఆనంద్ పీటీఐతో మాట్లాడుతూ "బీసీసీఐ 72 పింక్ బంతులను ఆర్డర్ ఇచ్చింది వాటిని వచ్చే వారం మధ్యలో మేము వాటిని డెలివరీ చేస్తాం. మీరు దక్షిణాఫ్రికా సిరీస్లో చూసినట్లుగా, మా ఎరుపు 'SG టెస్ట్' బంతిలో మేము గణనీయమైన మార్పులు చేశాం. పింక్ బాల్కు కూడా మాకు అదే స్థాయిలో రీసెర్చ్ చేసే టీమ్ ఉంది" అని తెలిపారు.

ఐదు ఓవర్లకే పాడవుతున్నాయి
కాగా, గతంలో ఎస్జీ బంతులు ఐదు ఓవర్లకే పాడవుతున్నాయని, ఆ ప్రభావం మ్యాచ్పై పడుతోందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న సంగతి తెలిసిందే. "ఒకప్పుడు ఎస్జీ బంతులు చాలా బాగుండేవి.. ఎందుకో తెలీదు కానీ ఈ మధ్య కాలంలో ఉత్పత్తి అయినవి చాలా నాసిరకంగా ఉంటున్నాయి" అని కోహ్లీ అన్నాడు.

ఎస్జీకి బదులుగా డ్యూక్స్ బంతులు
టెస్టు క్రికెట్కు ఎస్జీకి బదులుగా డ్యూక్స్ బంతులు ఉపయోగిస్తే మంచిదని కోహ్లీ సూచించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్, వెస్టిండీస్ల్లో జరిగే టెస్టుల్లో డ్యూక్ బంతిని వాడుతుండగా.. భారత్లో ఎస్జీ.. మిగతా దేశాల్లో కూకాబుర్రా బంతుల్ని ఉపయోగిస్తున్నారు. డ్యూక్ బంతులు ఇంగ్లాండ్లో తయారవుతుండగా, ఎస్జీ బంతులు మాత్రం భారత్లోనే తయారవుతుండటం విశేషం.

ఐసీసీ నిబంధనల ప్రకారం
ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ దేశంలో ఏ బంతి వినియోగించాలన్న నిబంధన లేదు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక కూకాబుర్ర బంతులను వినియోగిస్తుండగా.... ఇంగ్లాండ్ డ్యూక్, భారత్ ఎస్జీ బంతులను వాడతున్నాయి. ఈ సీజన్లో వాడిని ఎస్జీ బంతులు ఎంతో మెరుగ్గా ఉన్నాయని, అదే విషయాన్ని విరాట్ కోహ్లీ సైతం అంగీకరించాడు.

60 ఓవర్లు పాడవకుండా ఉండాలంటూ
అయితే, బంతి కనీసం 60 ఓవర్లు పాడవకుండా ఉండాలని కోహ్లీ కోరాడు. దీంతో భారత్-బంగ్లాల మధ్య కోల్కతా వేదికగా జరిగే తొలి డేనైట్ టెస్టుకు నాణ్యమైన బంతులు అందజేస్తామని ఆనంద్ నమ్మకం వ్యక్తం చేశాడు. ఆనంద్ మాట్లాడుతూ "పింక్ బంతుల అవసరం గురించి మాకు గతవారమే చెప్పారు. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాము" అని అన్నాడు.

ఇది మాకొక సవాల్
"నిజానికి పింక్ బాల్ టెస్ట్ ఇప్పుడు జరుగుతున్నప్పటికీ, మేము 2016-17 సీజన్ నుండి బంతిపై పని చేస్తున్నాము. బీసీసీఐ సంబంధించిన వ్యక్తులతో మేము నిరంతరం టచ్లోనే ఉన్నాము. ఇది మాకొక సవాల్, కానీ మేము దాని కోసం సిద్ధంగా ఉన్నాము" అని పరాస్ ఆనంద్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications