మూడు గంటలు ప్రాక్టీస్:
తొలి టెస్టు మూడు రోజుల్లోనే పూర్తి ముగిసినా.. భారత్, బంగ్లా జట్లు ఇండోర్లోనే ఉండి హోల్కర్ స్టేడియం ఫ్లడ్లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ చేశాయి. అయితే ఈ డే/నైట్ టెస్టు కోసం బంగ్లా ఆటగాళ్లు నీటిలో ముంచిన బంతితో ప్రాక్టీస్ చేశారు. సోమవారం బంగ్లా ఆటగాళ్లు సుమారు మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేశారు. డేనైట్ టెస్టుపై మంచు ప్రభావం ఉన్నందున ఆ పరిస్థితులకు అలవాటు పడేలా బంగ్లా ఆటగాళ్లు తడి బంతులతో ప్రాక్టీస్ చేసారు.
తడి బంతితో ప్రాక్టీస్:
బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ అనంతరం ప్రధాన కోచ్ రసెల్ డొమింగో ఆధ్వర్యంలో బంగ్లా ఆటగాళ్లు క్యాచులు పట్టడంలో శిక్షణ పొందారు. పింక్ బంతితో సాధ్యమైనంత ఎక్కువ ప్రాక్టీస్ పొందాలని తమ జట్టు చూస్తోందని బంగ్లా స్పిన్నర్ మెహిది హసన్ తెలిపాడు. ప్రాక్టీస్ సందర్భంగా హసన్ మాట్లాడుతూ... 'మూడు రోజులు కూడా మా పేస్ బౌలర్లు బంతిని తడిగా చేసి ప్రాక్టీస్ చేస్తారు. దీంతో పింక్ బాల్ టెస్టుకు అలవాటు పడతాం. బంతి తడిగా మారితే జారుతుంది, అయినా స్పిన్నర్లకు బౌన్స్, టర్న్ లభిస్తుంది' అని తెలిపాడు.
పింక్ బాల్కు అలవాటు పడలేదు:
'నేను పింక్ బాల్తో బ్యాటింగ్ చేశా. బంతి పిచ్కు తాకగానే వేగంగా దూసుకొస్తోంది. బ్యాట్పైకి కూడా త్వరగా వచ్చేస్తుంది. ఎక్కువ స్వింగ్ కూడా అవుతోంది. అయినా బ్యాట్స్మన్ కట్ షాట్లు ఆడొచ్చు. పింక్ బాల్కు మేమింకా అలవాటు పడలేదు. ఆ బంతితో ఆడటానికి మాకు ఎక్కువ సమయం దొరకలేదు. అయినా.. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి కృషి చేస్తాం' అని హసన్ అన్నాడు.
ఎక్కువ సేపు క్రీజులో ఉండాలి:
'పింక్ బంతితో ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఆడే కొద్ది అందరు అలవాటు పడతారు. బ్యాట్స్మెన్ ఎక్కువ సేపు క్రీజులో ఉండాల్సిన అవసరం ఉంది. పరిస్థితులకు అలవాటు పడే వరకూ ఓపిక అవసరం. క్యాచులు పట్టేటప్పుడు, ఫీల్డింగ్ చేసేటప్పుడు ఇబ్బందులేమీ లేవు. అయితే ఒక్కోసారి బంతి కనపడదు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి' అని హసన్ పేర్కొన్నాడు.